గ్రేటర్ వరంగల్/ జూలూరుపాడు, వెలుగు: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని వరంగల్, భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్లు సత్యశారద, అంకిత్ అన్నారు. శుక్రవారం వరంగల్ కలెక్టరేట్లో కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ సంధ్యతో కలిసి రైస్మిల్లర్లు, కాంట్రాక్టర్లు, సంబంధిత ఆఫీసర్లతో సమావేశం నిర్వహించి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మిల్లర్లు ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని ఆదేశించారు. అనంతరం కొనుగోలు సెంటర్ను సందర్శించారు.
ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా వరంగల్ మండలం పైడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బలమైన బాల్యానికి వెయ్యి మెట్లు కార్యక్రమానికి కలెక్టర్ హాజరై పలు సూచనలు చేశారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ అంకిత్ పరిశీలించారు. గురువారం రాత్రి కురిసిన అకాల వర్షాలకు మక్కలు తడవడంతో ఆయన కేంద్రాన్ని సందర్శించి వివరాలు ఆరా తీశారు.
