అమెరికాలో టూరిస్ట్ బస్సు బోల్తా.. ఐదుగురి మృతి.. మృతుల్లో భారతీయులు

అమెరికాలో టూరిస్ట్ బస్సు బోల్తా.. ఐదుగురి మృతి.. మృతుల్లో భారతీయులు
  • పర్యాటకుల్లో భారత్, చైనా, ఫిలిప్పీన్స్ వాసులు

న్యూయార్క్: అమెరికాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ టూరిస్టు బస్సు బోల్తా పడి ఐదుగురు మృతిచెందారు. మరికొందరు గాయపడ్డారు. టూరిస్ట్​లు శుక్రవారం కెనడా సరిహద్దులోని నయాగరా జలపాతాన్ని సందర్శించి న్యూయార్క్ ​సిటీకి తిరిగి వస్తుండగా బఫెలోకు 40 కి.మీ. దూరంలో పెంబ్రోక్​ దగ్గర్లో రాష్ట్ర రహదారిపై బస్సు బోల్తాపడింది.

 ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారని స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి. ప్రమాద సమయంలో బస్సులో  మొత్తం 54 మంది ఉన్నారని, మృతుల్లో పిల్లలు ఎవరూ లేరని న్యూయార్క్​ స్టేట్​ పోలీస్​కమాండర్​ మేజర్​ ఆండ్రీ రే తెలిపారు. ఘటన జరిగిన వెంటనే స్థానిక యంత్రాంగం అప్రమత్తమైందని, గాయపడిన వారిని నాలుగు హెలికాప్టర్లు, అంబులెన్స్​లలో దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించి ఫస్ట్​ ఎయిడ్​ చేయించి పంపించినట్టు తెలిపారు.

 గాయపడిన వారిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని తెలిపారు. బస్సును వేరే ఇతర వెహికల్స్​ ఢీకొట్టలేదని, డ్రైవరే నియంత్రణ కోల్పోవడంతో అదుపుతప్పి బోల్తా పడిందని ఆయన చెప్పారు. అలాగే, టూరిస్ట్​లలో ఎక్కువ మంది భారత్, చైనా, ఫిలిప్పీన్స్ దేశాలకు చెందినవారు ఉన్నారని అధికారులు తెలిపారు.