గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఇది బిగ్ షాక్ అనే చెప్పాలి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయో లేదో అలా సిలిండర్ ధరల్లో మార్పు చోటు చేసుకుంది. దేశీయ చమురు కంపెనీలు 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరను రూ.21 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రకటించాయి. గత నెలలో కూడా కమర్షియల్ సిలిండర్ల ధరను రూ.103 పెంచారు.
దీంతో ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1796.50కు చేరింది. ఇక హైదరాబాద్ లో రూ.2024.5గా ఉంది. అయితే 14.2 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలో ఆయా కంపెనీలు ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం డొమెస్టిక్ సిలిండర్ రూ.918.50కి విక్రయిస్తున్నారు. అంతకుముందు ప్రభుత్వం ఈ సిలిండర్ ధరను రూ.200 తగ్గించింది. కాగా గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటుంది. ఈ ధరలను ప్రతి నెల ఒకటో తారీఖున మారుస్తుంటారు.
మరోవైపు ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 5పైసలు, 4పైసల చొప్పున తగ్గాయి. విజయవాడలో ఈ రోజు లీటర్ పెట్రోల్ ధర రూ. 111.87 గాను, లీటర్ డీజిల్ రూ.99.61 గా ఉంది. హైదరాబాద్ లో ఈ రోజు లీటర్ పెట్రోల్ ధర రూ. 109.66 గాను, లీటర్ డీజిల్ ధర రూ. 97.82 గా ఉంది, నిన్న నమోదైన ధరలతో పోల్చితే ఇవాళ హైదరాబాద్ లో పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి తేడా లేదు.