- రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ విజ్ఞప్తి
హైదరాబాద్ , వెలుగు: రిజర్వేషన్లు 50 శాతం దాటొద్దని ఐదుగురు జడ్జిలు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏడుగురు జడ్జీలతో విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేసేలా సుప్రీంకోర్టును రాష్ట్ర సర్కారు కోరాలని బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ విజ్ఞప్తి చేశారు.
రిజర్వేషన్లపై ఈ ధర్మాసనం విచారణ జరిపి, బీసీలకు న్యాయం చేయాలన్నారు. రాష్ట్రంలో బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఆశలు కల్పించి, ఇప్పుడు మొత్తం రిజర్వేషన్లు 50 శాతంలోపు కల్పించేలా నిర్ణయించడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం నిరంజన్రెడ్డి ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బి.ఆర్. గవాయ్ ఇటీవల ఏపీ పర్యటనలో మాట్లాడుతూ.. పరిస్థితులకు తగ్గట్టుగా రాజ్యాంగంలో మార్పులు జరిగాయని చెప్పారన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు, హైకోర్టు వ్యాఖ్యలు కనువిప్పు కలిగించాలన్నారు. రాజకీయ కారణాలతో బీసీ బిల్లులను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చకపోవడం దురదృష్టకరమని, ఇది బీసీలకు తీవ్రమైన అన్యాయం చేసే చర్యగా భావించాల్సి వస్తుందని అన్నారు.
