- రూ.లక్షల్లో శాలరీ ప్యాకేజిని ఆఫర్ చేస్తున్న కంపెనీలు
- కామర్స్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, మ్యాథ్మెటిక్స్, మేనేజ్మెంట్ స్టూడెంట్లకు ఫుల్ గిరాకీ
- ఎఫ్ఎంసీజీ, ఫైనాన్స్, బ్యాంకింగ్, టెక్ కంపెనీలే ముందు
బిజినెస్ డెస్క్, వెలుగు: మార్కెట్లో హైరింగ్ యాక్టివిటీ ఫుల్గా పెరిగింది. ఎంతలా అంటే ఇంకా డిగ్రీ పూర్తికాని వారి వెంట కూడా రిక్రూటర్లు పడుతున్నారు. నాన్ టెక్నికల్ డిగ్రీలు చేస్తున్న స్టూడెంట్లకు రూ.లక్షల్లో శాలరీని ఆఫర్ చేస్తున్నారు. మార్కెట్లో ట్యాలెంట్ ఉన్నవారికి ఫుల్గా డిమాండ్ ఉంది. దీంతో అండర్ గ్రాడ్యుయేట్లకు (డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు) ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది డిమాండ్ క్రియేట్ అయ్యిందని ఎనలిస్టులు పేర్కొన్నారు. ఇన్స్టిట్యూట్లకు కూడా ఎన్నడూ లేనంతగా ఆఫర్ లెటర్లు అందుతున్నాయి. కంపెనీలు రికార్డ్ లెవెల్ల్లో అట్రిషన్(ఉద్యోగులు జాబ్ మానేయడం) సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో ట్యాలెంట్ ఉన్నవారి కోసం రిక్రూటర్ల వెతుకలాట తీవ్రమయ్యింది. అంతేకాకుండా కరోనా తర్వాత బిజినెస్లు తిరిగి సాధారణ స్థాయికి చేరుకోవడంతో కూడా కంపెనీలు హైరింగ్పై ఎక్కువ ఫోకస్ పెట్టాయి.
ఈ కంపెనీల నుంచే..
వివిధ కాలేజిల్లోని ప్లేస్మెంట్ సెల్స్ ప్రకారం, మెకెన్సీ, బెయిన్, బీసీజీ, మీషో, కీర్నీ, యాక్సెంచర్, ఈవై, పీడబ్ల్యూసీ, డెలాయిట్, అమెజాన్, డల్బెర్గ్, ఫిషర్ జోర్డన్, కేపీఎంజీ వంటి కంపెనీలు అండర్గ్రాడ్యుయేట్ స్టూడెంట్లను ఎక్కువగా హైర్ చేసుకుంటున్నాయి. కామర్స్, ఎకనామిక్స్, మ్యాథ్మెటిక్స్, స్టాటిస్టిక్స్, మేనేజ్మెంట్ కోర్సులు చేసేవారికి ఎక్కువ డిమాండ్ ఉంది. ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, టెక్నాలజీ, కన్సల్టింగ్ వంటి సెక్టార్లతో సహా వివిధ సెక్టార్లలోని కంపెనీలు ట్యాలెంట్ ఉన్నవారిని హైర్ చేసుకోవడానికి పోటీ పడుతున్నాయి’ అని సెయింట్ జావియర్ కాలేజ్ (ముంబై) మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ స్టడీస్ హెడ్ సోని జార్జీ తారకన్ అన్నారు. తమ క్యాంపస్ అందుకున్న హయ్యస్ట్ శాలరీ ప్యాకేజి రూ. 30 లక్షలని చెప్పారు. లీడింగ్ గ్లోబల్ ఎఫ్ఎంసీజీ కంపెనీ లోకల్ జాబ్ పోస్ట్ కోసం ఈ ప్యాకేజిని ఆఫర్ చేసిందని సోని అన్నారు. ఈ సారి అందిన ఆఫర్లలో యావరేజి శాలరి ప్యాకేజి రూ. 6–6.5 లక్షలుగా ఉందని, కరోనా ముందు ఈ నెంబర్ రూ. 4.5–5.5 లక్షలుగా ఉందని చెప్పారు. ఎస్ఆర్సీసీ కూడా ఈ ఏడాది మంచి ఆఫర్లను అందుకుంది. ఈ సారి మొత్తం 297 జాబ్ ఆఫర్స్ వచ్చాయని, కిందటేడాదితో పోలిస్తే ఈ నెంబర్ 123 శాతం ఎక్కువని ఎస్ఆర్సీసీ పేర్కొంది. ఈ సారి క్యాంపస్ అందుకున్న హయ్యస్ట్ ప్యాకేజి రూ. 30 లక్షలని, కిందటేడాది ఈ నెంబర్ రూ. 25 లక్షలుగా ఉందని వివరించింది. అంతేకాకుండా యావరేజి శాలరీ ప్యాకేజి కూడా రూ. 9.86 లక్షల నుంచి రూ. 10.8 లక్షలకు పెరిగిందని తెలిపింది. భారత్ పెట్రోలియం నుంచి హయ్యస్ట్ ఆఫర్ అందుకున్నామని, శాలరీ ప్యాకేజి రూ. 22 లక్షలని లయోలా కాలేజ్ (చెన్నై) పేర్కొంది. తమకు అందిన జాబ్ ఆఫర్లలో ఆడిట్ అసిస్టెంట్, డేటా ప్రాసెసింగ్ స్పెషలిస్ట్, డేటా ఎనలిస్ట్ వంటి ఎంట్రీ లెవెల్ పొజిషన్ల వాటానే 85 శాతం ఉందని ఈ కాలేజ్ డైరెక్టర్ వీ దుర్గా రాజులు అన్నారు. క్రైస్ట్ కాలేజ్లో కూడా యావరేజ్ శాలరీ ప్యాకేజి రూ. 4.5 లక్షల నుంచి రూ. 5.25 లక్షలకు పెరిగింది. చాలా కంపెనీలు అండర్గ్రాడ్యుయేట్ కాలేజిల నుంచి కూడా హైర్ చేసుకుంటున్నాయి. దీని బట్టి టెక్ స్టూడెంట్లనే కాకుండా నాన్ టెక్ స్టూడెంట్లకు డిమాండ్ పెరిగినట్టు తెలుస్తోంది.
టాప్ డిగ్రీ కాలేజిలకు ఆఫర్ల వెల్లువ..
ప్రస్తుతం అండర్గ్రాడ్యుయేట్లకు మంచి డిమాండ్ ఉందని దేశంలోని టాప్ డిగ్రీ కాలేజీల ప్రొఫెసర్లు, టాప్ ఉద్యోగులు చెబుతున్నారు. లేడీ శ్రీ రామ్ కాలేజ్ ఫర్ వుమెన్ (ఎల్ఎస్ఆర్), శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (ఎస్ఆర్సీసీ–ఢిల్లీ), సెయింట్ జావియర్ కాలేజ్ (ముంబై), లయోలా కాలేజి (చెన్నై), క్రైస్ట్ (డీమ్డ్ యూనివర్శిటీ– బెంగళూరు) వంటి ఫేమస్ కాలేజీలకు వివిధ కంపెనీల నుంచి మంచి ప్యాకేజితో జాబ్ ఆఫర్లు వచ్చాయి. ఈ ఏడాది ఆఫర్ చేస్తున్న శాలరీ ప్యాకేజి 20–40 శాతం పెరగగా, జాబ్ ఆఫర్ల సంఖ్య 80–130 శాతం పెరిగింది. ఎల్ఎస్ఆర్ (ఢిల్లీ) లో చదువుతున్న ఫైనల్ ఇయర్ స్టాటిస్టిక్స్ స్టూడెంట్కు రూ. 40 లక్షల ప్యాకేజీ వచ్చిందని ఈ కాలేజ్ పేర్కొంది. కిందటేడాది తమ కాలేజ్కు అందిన హయ్యస్ట్ శాలరీ ప్యాకేజ్ రూ. 37.8 లక్షలని ఈ కాలేజ్ ప్రొఫెసర్లు పేర్కొన్నారు. ఈ ఏడాది మొత్తం 231 జాబ్ ఆఫర్లను అందుకున్నామని, కిందటేడాది 193 జాబ్ ఆఫర్లు వచ్చాయని చెప్పారు. కరోనా వలన గత రెండేళ్ల పాటు ఇండస్ట్రియల్ గ్రోత్ నెమ్మదిగా ఉందని ఎల్ఎస్ఆర్ ప్రొఫెసర్ కనికా అహుజా పేర్కొన్నారు. దీంతో ఈ ఏడాది హైరింగ్ పెరిగిందని, ప్లేస్మెంట్ సీజన్లో కంపెనీల నుంచి రష్ కనిపిస్తోందని, టాప్ స్లాట్ల కోసం రిక్రూటర్లు పోటీ పడుతున్నారని అన్నారు.
కామర్స్, మేనేజ్మెంట్ స్టడీస్, సైన్స్ స్టూడెంట్లు ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు కంపెనీలు హైర్ చేసుకుంటున్నాయి. దేశం మొత్తం మీద మా కాలేజ్కు చెందిన 800 మంది స్టూడెంట్లను ఓ కన్సల్టింగ్ కంపెనీ హైర్ చేసుకుంది. యావరేజ్గా రూ. 4 లక్షలను ఈ కంపెనీ ఆఫర్ చేసింది. అదే ఎంబీఏ స్టూడెంట్ల కోసం యావరేజ్గా రూ. 5 లక్షల శాలరీ ప్యాకేజిని కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి.
- ఈథేమ్స్ కాలేజ్ చైర్మన్ జీ కాళీ ప్రసాద్