న్యూఢిల్లీ: పేటీఎం (వన్97 కమ్యూనికేషన్స్) లో యాంట్ఫిన్ (నెదర్లాండ్స్) హోల్డింగ్కి చెందిన 10.30 శాతాన్ని కంపెనీ ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ కొనుగోలు చేయనున్నారు. నో క్యాష్ డీల్ విధానంలో ఈ ట్రాన్సాక్షన్ జరగనుంది. అంటే విజయ్ శేఖర్ శర్మ తన ఓవర్సీస్ కంపెనీ రెజిలియంట్ అసెట్ మేనేజ్మెంట్ బీవీ ద్వారా యాంట్ఫిన్ నుంచి ఈ వాటాను దక్కించుకోనున్నారు.
ఈ డీల్ పూర్తయితే పేటీఎంలో విజయ శేఖర్ శర్మ వాటా 19.42 శాతానికి పెరుగుతుంది. యాంట్ఫిన్ వాటా 13.5 శాతానికి తగ్గుతుంది. డీల్ ప్రకారం, ఈ వాటాకు బదులుగా ఆప్షనల్ కన్వర్టబుల్ డిబెంచర్స్ (ఓసీడీ) ను యాంట్ఫిన్కు రెజిలియంట్ అసెట్ ఇష్యూ చేస్తుంది. యాంట్ఫిన్ తన వాటాలపై ఎకనామిక్ రైట్స్ కలిగి ఉంటుంది. అంటే డివిడెండ్లు పొందడానికి వీలుంటుంది.
‘నో క్యాష్ పేమెంట్ డీల్ కింద వాటాను విజయ్ శేఖర్ శర్మ కొనుగోలు చేస్తున్నారు. ఎటువంటి ఆస్తులను ఆయన తనఖా పెట్టడం లేదు’ అని ఎక్స్చేంజి ఫైలింగ్లో పేటీఎం పేర్కొంది. వాటా కొనుగోలు తర్వాత బోర్డులో ఎటువంటి మార్పు ఉండదని, విజయ్ శేఖర్ శర్మనే సీఈఓగా కొనసాగుతారని వెల్లడించింది. జాక్మాకు చెందిన యాంట్ గ్రూప్ సబ్సిడరీనే యాంట్ఫిన్.
పేటీఎం షేర్లు జూమ్..
వన్97 కమ్యూనికేషన్ షేర్లు సోమవారం సెషన్లో 7 శాతం ర్యాలీ చేసి, రూ.851 దగ్గర సెటిలయ్యాయి. ఇంట్రాడేలో కంపెనీ షేర్లు 12 శాతం వరకు పెరిగాయి. పేటీఎం మార్కెట్ క్యాప్ రూ.3,511 కోట్లు పెరిగి రూ.53,957 కోట్లకు చేరుకుంది.
జొమాటోతో లాభాలే లాభాలు..
ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో ఇన్వెస్టర్లకు భారీ లాభాలను తెచ్చిపెడుతోంది. కంపెనీ షేరు సోమవారం సెషన్లో రూ.100 మార్క్ను క్రాస్ చేసింది. గత నెల రోజుల్లో జొమాటో షేర్లు ఇన్వెస్టర్లకు 30 శాతం రిటర్న్ను ఇచ్చాయి. గత ఆరు నెలల్లో 80 శాతం రిటర్న్ ఇవ్వడం విశేషం. జొమాటో ఈ ఏడాది జూన్ క్వార్టర్లో రూ.2 కోట్ల నికర లాభం సాధించింది. కంపెనీ ఎట్టకేలకు లాభాల్లోకి రావడంతో ఇన్వెస్టర్ల ఆసక్తి పెరుగుతోంది.
కానీ, కంపెనీ వాల్యుయేషన్ ఇంకా ఎక్కువగానే ఉందని ప్రాఫిట్మార్ట్ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ అవినాష్ గోరక్షకర్ అన్నారు. ప్రస్తుత లెవెల్స్ దగ్గర జాగ్రత్తగా ఉంటానని ఇండిట్రేడ్ క్యాపిటల్ చైర్మన్ సుదీప్ బందోపధ్యాయ్ అన్నారు. కంపెనీ సరియైన డైరెక్షన్లో ఉందని, స్మాల్ ప్రాఫిట్స్ను కూడా ప్రకటించిందని చెప్పారు. అయినప్పటికీ ప్రస్తుత వాల్యుయేషన్స్ను కంపెనీ ఎర్నింగ్స్ జస్టిఫై చేయలేకపోతున్నాయని అన్నారు.