పెళ్లి కానివారికీ కాంపెన్సేషన్ ఇవ్వండి- రాష్ట్ర ప్రభుత్వానికి  హైకోర్టు ఆదేశం

పెళ్లి కానివారికీ కాంపెన్సేషన్ ఇవ్వండి- రాష్ట్ర ప్రభుత్వానికి  హైకోర్టు ఆదేశం

‘కొండపోచమ్మ’ ముంపు బాధితుల పిటిషన్‌పై తీర్పు

హైదరాబాద్, వెలుగు: కొండపోచమ్మ రిజర్వాయర్ ముంపు బాధితుల్లో 18 ఏళ్లు నిండిన పెళ్లి కానివారికి కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. సిద్దిపేట జిల్లా ములుగు మండలం మామిడిడ్యాల గ్రామానికి చెందిన వై. బాబులు సహా 25 మంది దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన జస్టిస్ ఎం.ఎస్. రామచంద్రరావు, జస్టిస్ కె. లక్ష్మణ్ ల డివిజన్ బెంచ్ శనివారం ఈ తీర్పు చెప్పింది. ఆరు వారాల్లో పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది. వీరందరికీ ఖర్చుల నిమిత్తం  రూ.5 వేలు చొప్పున చెల్లించాలని చెప్పింది. భూ సేకరణ చట్టంలోని పునరావసం, పునర్ నిర్మాణ పథకం కింద పరిహారం చెల్లించకపోవడం రాజ్యాంగ విరుద్ధమే అవుతుందని బెంచ్ పేర్కొంది. జీవోలు 78, 192, 435 లో పరిహారం చెల్లింపు సంబంధించిన వివరాలు అవివాహితుల పట్ల వివక్ష చూపే విధంగా ఉన్నాయని, ఆ జీవోలు చట్టవిరుద్ధమని తేల్చిచెప్పింది. వివాహితులతో సమానంగా పిటిషనర్లకు 250 గజాలలో రెండు పడకల ఇల్లు నిర్మాణానికి అవసరమైన నిధులు ఇవ్వాలని ఆదేశించింది.