- గర్భవతి అయ్యాక వదిలించుకునే యత్నం
- బావ ఇంటి ముందు బాధితురాలి ధర్నా
- వారిపై నిందితుడి కుటుంబసభ్యుల దాడి
ఎడపల్లి, వెలుగు: తనకు అందరూ మగపిల్లలు ఉన్నారని, తనకు ఆడ పిల్లలు కావాలని, మాయ మాటలు చెప్పి భార్య చెల్లెను గర్భవతిని చేసిన బావ.. పెళ్లి చేసుకోవాలని అడిగితే నిరాకరించడంతో బావపై మరదలు నిరసనకు దిగింది. ఈ ఘటన నిజామాబాద్జిల్లా ఎడపల్లి మండలంలోని దుబ్బతాండలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన రమావత్ ఠాకూర్, అనిత దంపతులకు నలుగురు కుమార్తెలు. 2007లో భర్త మరణించడంతో అనిత కూలీ పనులు చేస్తూ పిల్లలను పెంచి పెద్ద చేసింది. తన రెండో కుమార్తె శ్రీదేవిని అదే గ్రామానికి చెందిన బదావత్ సాయిరాంకు ఇచ్చి 2021లో పెండ్లి జరిపించారు. వీరికి ముగ్గురు కొడుకులు. ఇదిలా ఉండగా సాయిరాం తన భార్య చెల్లెలైన నీలపై కన్నేశాడు. మీ అక్కకు ఆడ పిల్లలు పుట్టడం లేదని, తనకు ఆడపిల్లలు కావాలని తనను పెళ్లి చేసుకుంటానని నీలను లోబరుచుకున్నాడు. ఆమెను గర్భవతిని చేశాడు.
ఆర్వాత ఆమె పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తూ తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ విషయంపై గతంలోనే పంచాతీలు పెట్టినా సాయిరాం తీరు మారలేదు. శనివారం గ్రామంలో మరోసారి పంచాతీ ఏర్పాటు చేయగా, సాయిరాం హాజరుకాకుండా పరారయ్యాడు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన నీల తన తల్లితో కలిసి సాయిరాం ఇంటి ముందు బైఠాయించి నిరసనకు దిగింది. నిరసన చేస్తున్న సమయంలో సాయిరాం కుటుంబసభ్యులు బాధితురాలు, ఆమె తల్లి, బంధువులపై దాడికి పాల్పడ్డారు. దీంతో నీల ఎడపల్లి పోలీసులను ఆశ్రయించి సాయిరాంపై ఫిర్యాదు చేసింది. తనను మోసం చేసిన సాయిరాంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.
