
- వైస్ చాన్స్లర్ పదవి కోసం 149 అప్లికేషన్లు
- ఆశావహుల్లో రిటైర్డ్, వర్కింగ్ ప్రొఫెసర్లు
- సెర్చ్ కమిటీ ముందు హాజరుకానున్న ప్రొఫెసర్లు
- ముగ్గురి పేర్లతో సిఫార్సు, ఒకరిని సెలెక్ట్ చేయనున్న గవర్నర్
- ఈ నెల 21తో ముగియనున్న ప్రస్తుత వీసీ రమేశ్ పదవీకాలం
వరంగల్, వెలుగు : రాష్ట్రంలో హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత అతి పెద్దది వరంగల్ కాకతీయ యూనివర్సిటీ. కేయూ వీసీ తాటికొండ రమేశ్ పదవీ కాలం ఈ నెల 21తో ముగుస్తోంది. దీంతో కేయూతో పాటు మరో తొమ్మిది యూనివర్సిటీలకు వీసీలకు నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 10 యూనివర్సిటీల్లో వీసీల పోస్ట్ కోసం 312 మంది 1,382 అప్లికేషన్లు అందజేశారు. ఇందులో ఒక్క కాకతీయ యూనివర్సిటీ వీసీ పోస్ట్ కోసమే 149 అప్లికేషన్లు వచ్చాయి. ఈ పోస్ట్ కోసం గతంలో పది, పదిహేను మంది మాత్రమే పోటీ పడగా ఈ సారి 149 మంది పోటీలో ఉండడం గమనార్హం.
1976లో ఏర్పాటు.. 14 మంది వీసీల సేవలు
కాకతీయ యూనివర్సిటీని 1976 ఆగస్ట్ 19న ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు 14 మంది వైస్ ఛాన్స్లర్లుగా సేవలు అందించారు.12 జిల్లాల పరిధిలో విద్యాసంస్థలు కలిగిన కేయూలో 248 టీచింగ్ ఫ్యాకల్టీ ఉండగా, 622 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు. ఈ యూనివర్సిటీ గతేడాది ‘ఏ ప్లస్’ న్యాక్ గ్రేడ్ సైతం సాధించింది. యూనివర్సిటీ రికార్డుల ప్రకారం 28 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ప్రస్తుతం వీసీగా పనిచేస్తున్న తాటికొండ రమేశ్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నియామకం అయ్యారు. ఆయన పదవీ కాలంలో మరో నాలుగు రోజుల్లో ముగియనుంది.
ఒక్క పోస్ట్కు 149 అప్లికేషన్లు
కేయూ 15వ వైస్చాన్స్లర్ పోస్ట్ కోసం చాలా మంది తమ అప్లికేషన్లతో ప్రభుత్వం వద్ద క్యూ కట్టారు. ప్రొఫెసర్గా పదేండ్ల అనుభవం కలిగిన వారితో పాటు, రిటైర్డ్ ప్రొఫెసర్లు సైతం పోటీ పడుతున్నారు. కేయూ వీసీ పోస్ట్ కోసం తమ పేరును పరిశీలించాలంటూ ఏకంగా 149 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇందులో కొందరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుత వీసీ తాటికొండ రమేశ్తో పాటు వివిధ యూనివర్సిటీల్లో వీసీలుగా పనిచేసిన బి.వెంకటరత్నం, ఎండీ.ఇక్బాల్ అలీ, ఖాజా అల్తాఫ్ హుస్సేన్తో పాటు ప్రొఫెసర్లు వడ్డె రవీందర్, మంద అశోక్కుమార్, మల్లారెడ్డి, తౌటం శ్రీనివాస్, బన్న అయిలయ్య ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
ముగ్గురు సభ్యులతో సెర్చ్ కమిటీ
యూనివర్సిటీ వీసీల నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ముగ్గురు సభ్యులతో సెర్చ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సభ్యులు వీసీ పోస్ట్కు అప్లై చేసుకున్న వారితో ఆఫ్లైన్, ఆన్లైన్లో మీటింగ్ నిర్వహించనున్నారు. తర్వాత కేయూ వీసీ పోస్ట్ కోసం ముగ్గురి పేర్లను గవర్నర్కు పంపుతారు. అందులో ఒకరిని గవర్నర్ వీసీగా నియమిస్తారు. కాగా యూజీసీ రూల్స్ పాటించడంతో పాటు, రాజకీయాలకు అతీతంగా, అవినీతి మరకలు లేని సామాజిక స్పృహ ఉన్న వారికి కేయూ వీసీ పదవి అప్పగించాలని రిటైర్డ్, వర్కింగ్ ప్రొఫెసర్లు కూరపాటి వెంకటనారాయణ, సారంగపాణి, వీరన్న, తిరుణహరి శేషు కోరుతున్నారు.