ఇటీవల మన దేశం ఎదుర్కొంటున్న ఇంధన సంక్షోభం, ఎరువుల కొరత, పెరుగుతున్న ఖర్చులు, వాతావరణ సమస్యలు ప్రపంచంలో నేడు నెలకొన్న రాజకీయాలు, భౌగోళిక వాతావరణంతో ముడిపడి ఉన్నాయి. వాటిని ఎదుర్కోవడానికి అదే రీతిన మన ప్రణాళికలు ఉండాలి. ప్రపంచ వాతావరణ సంస్థ ఇటీవలి ఎల్నినో/లానినా' అప్డేట్ ప్రకారం.. 2026 జూన్-ఆగస్టు మధ్య కాలంలో 'ఎల్నినో' ఏర్పడే అవకాశం 80 శాతం ఉంది. ఇది కనీసం నవంబర్ వరకు కొనసాగే అవకాశం 90 శాతం లేదా అంతకంటే ఎక్కువగా ఉంది.
ఎల్నినో గరిష్ట తీవ్రత, అది సంభవించే సమయం విషయంలో కొంత అనిశ్చితి ఉన్నప్పటికీ, చాలావరకు అంచనా నమూనాలు ఇది కనీసం మధ్యస్థ స్థాయి తీవ్రతతో లేదా బలమైన స్థాయిలోనే ఉంటుందని సూచిస్తున్నాయి. ఎల్నినో/లానినా ప్రభావంవల్ల ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్రంలో వాణిజ్య పవనాలు బలహీనపడటం, తత్ఫలితంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వలన సంభవించే ప్రభావం ప్రపంచ వాతావరణంపై ఉంటుంది. ఆయితే ఎల్నినో/లానినా సమస్యలు కొత్తవి కాదు, ఇది 2-7 సంత్సరాలకు ఒకసారి పునరావృతమవుతాయి. వాటిని ఎదుర్కోవడానికి స్థానికమైన ముందస్తు ప్రణాళికలు, ప్రాంతీయ వాతావరణ పరిస్థితులపై అవగాహన చాలా ముఖ్యం.
ఎల్నినో/లానినాని ఎదుర్కోవడంలో ఇతర దేశాల వూహ్యాలు, ప్రణాళికలు సమీక్షించడం ఎంతో అవసరం. భూమధ్యరేఖ పసిఫిక్ మహా సముద్రం చుట్టూ ఉన్న దేశాల్లో ముఖ్యంగా పెరూ, ఈక్వెడార్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ లాంటి దేశాలు ఎల్నినో, లానినాల వల్ల అత్యంత ప్రత్యక్ష, తీవ్ర క్రమబద్ధమైన ప్రభావాలను ఎదుర్కొంటాయి. ఈ దేశాలు ఆ ప్రభావాలను గతంలో కంటే కొంతమేరకు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయి. అందులో ఇండోనేషియా వరి పండించే ప్రాంతం కూడా దాదాపు ఇలాంటి ప్రమాదాలనే ఎదుర్కొంటుంది. ఆ దేశం భిన్నంగా చేసిన పని ఏమిటంటే, వాతావరణ శాస్త్రాన్ని అత్యంత అవసరమైన ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా చేయడంలో పెట్టుబడి పెట్టడం, వాతావరణ క్షేత్ర పాఠశాలల ద్వారా రైతులు కాలానుగుణ అంచనాలను చేరవేయడం, కరువు తీవ్రతకు ముందే నాట్లువేసే క్యాలెండర్లను సర్దుబాటు చేసుకోవడంపై అవగాహన కల్పించారు. ఎల్నినో సంఘటనలు ఎదుర్కొనే ఈ దేశాలు రెండు అర్ధగోళాల నుంచి నేర్చుకోవాల్సిన పాఠం స్పష్టంగా ఉంది.
ఎల్నినోను జాతీయ ఆర్థిక అత్యవసర పరిస్థితిగా పరిగణించాలి
మన దేశంలో గతంలో ఎల్నినో సంఘటనలు 1986-–1988, 1991-–92, 2002–-03లో ఏర్పడడం వల్ల కరువులు ఏర్పడి వ్యవసాయరంగంలో గణనీయమైన ప్రతికూల ప్రభావాన్ని చూపించాయి. ఈ సంవత్సరం భారతదేశ వ్యవసాయ ఉత్పత్తిపై భారీగా ప్రభావం చూపగలదు. కాబట్టి రైతులు సాగు మెళకువలు సర్దుబాటు చేసుకోవాలి, ఎల్నినోను ఒక వాతావరణ సంఘటనగా కాకుండా జాతీయ ఆర్థిక అత్యవసర పరిస్థితిగా పరిగణించాలి. ఇక మన దేశంలో కూడా భారత వాతావరణశాఖ ద్వారా పటిష్టమైన వాతావరణ అంచనా వ్యవస్థ ఉంది.
ఇది రుతుపవనాల ప్రారంభాన్ని ఒక నెల ముందుగానే బ్లాక్ స్థాయిలో అంచనా వేయ గలదు. ఇది దశాబ్దం క్రితం ఉన్న జిల్లా స్థాయి, ఒకవారం ముందు హెచ్చరికలతో పోలిస్తే ఒక పెద్ద ముందడుగు. కానీ, స్మార్ట్ఫోన్ సిగ్నల్ లేకుండా, ఇంగ్లిష్ రాకుండా పొలంలో నిలబడిన రైతుకు అది ఉపకరిస్తుందా లేదా అనేదే ఒక అనుమానం. ఈ సమస్యను ఎదుర్కోవడానికి, కృత్రిమ మేధ ఆధారిత వాతావరణ అంచనాలను రైతులకు వారి సొంతభాషలో వారికి చేర్చాలి, వర్షపాతంలోటు ఉన్న జిల్లాల్లో నీటి నిర్వహణను పైలట్ దశ నుంచి ప్రామాణిక పద్ధతిగా మార్చాలి. శాస్త్రీయంగా నిరూపితమైన కరువును తట్టుకునే విత్తన రకాలు విత్తే కాలానికి ముందే రైతుల చేతికి అందాలి. ఇక పంటల బీమా విషయంలో ఉపగ్రహం తక్కువ వర్షపాతాన్ని గుర్తించినప్పుడు స్వయంచాలకంగా చెల్లింపులు చేయడానికి స్థూల ఆర్థిక నిర్ణయాలలో శాశ్వత పరిష్కారాలు అవసరం.
నైరుతి రుతుపవనాల వర్షాలతో గోదావరి, కృష్ణానదులు ప్రభావితం
మన రాష్ట్రం విషయానికి వస్తే భౌగోళికంగా తెలంగాణ వాయువ్య దిశలో దక్కన్ పీఠభూమిని కలిగి ఉన్న ద్వీపకల్ప భారతదేశంలో ఉంది. రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదులు ప్రధానమైనవి. సుమారు 43 శాతం ప్రాంతం కృష్ణానది పరీవాహక ప్రాంతంలో, సుమారు 56 శాతం ప్రాంతం గోదావరి నది పరీవాహక ప్రాంతంలో విస్తరించి ఉంది. కావున ఈ నదుల్లో నీటి ప్రవాహం రాష్ట్ర సాగుకు ప్రధానమైనవి.
అయితే, మన నదులు నిరంతరం ప్రవహించే ఉత్తర భారతదేశంలోని హిమాలయ నదులవలె కాకుండా, ఇక్కడ ప్రవాహాలు నైరుతి రుతుపవనాల కాలంలోని 3 నుంచి 4 నెలలలో, అంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మాత్రమే సంభ విస్తాయి. అంతేకాకుండా మహారాష్ట్ర, కర్ణాటకలోని పశ్చిమ కనుమలలో కురిసే నైరుతి రుతు పవనాల వర్షాలు కూడా గోదావరి, కృష్ణా నదులు నిండడాన్ని ప్రభావితం చేస్తాయి. నైరుతి రుతుపవనాల రాష్ట్ర నదులు నిండడంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి.
ఇక మన రాష్ట్రాలో వార్షిక వర్షపాతం సాధారణ స్థాయి 919.0 మి.మీ. (1989–-2023 ఆధారంగా). రాష్ట్రానికి వచ్చే వార్షిక వర్షపాతంలో 80.4% (738.6 మి.మీ.) కేవలం నైరుతి రుతుపవనాల నుంచే లభిస్తుండగా, ఈశాన్య రుతుపవనాల వాటా 12.2% (113.2 మి.మీ.). నైరుతి రుతుపవనాల వర్షపాతంలో అత్యధిక వాటా జులై నెల (24.9%) నుంచి వస్తుంది. ఆ తర్వాత ఆగస్టు (23.7%), సెప్టెంబర్ (17.7%), జులై (14.5%) ఉన్నాయి. నైరుతి రుతుపవనాల ద్వారా ఈ నెలల్లో కురిసే వానలు రాష్ట్రలో పండించే పంటకు ప్రధాన నీటి వనరులు. నైరుతి రుతుపవనాల ద్వారా ఈ నెలల్లో వర్షం కురవకపొతే రాష్ట్రంలో కరువుకు దారితీస్తుంది.
వర్షపు నీటిని సేకరించి పునర్వినియోగించాలి
రాష్ట్రంలో రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్గొండ జిల్లాలు చారిత్రాత్మకంగా కరువుకు గురవుతూ వస్తున్నాయి. వివిధ జిల్లాల మధ్య వార్షిక వర్షపాతంలో (జూన్ నుంచి మే వరకు) గణనీయమైన వ్యత్యాసాలు ఉన్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. అత్యల్ప వార్షిక వర్షపాతం జోగులాంబ గద్వాల్, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో నమోదవుతాయి.
వాతావరణ మార్పుల వల్ల ఈ జిల్లాల్లో కరువు సంభవించే అవకాశాలు అధికం. ఈ నేపథ్యంలో వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కోవడానికి సాగులో స్థానిక సాగు పద్ధతులు అవలంబించాలి. అందులో భాగంగా వాతావరణ పరిస్థితులను తట్టుకునే పంటలు, పంట రకాలు, సుస్థిర నీటి నిర్వహణ పద్ధతులు, మెరుగైన చీడపీడల నివారణ విధానాలు, అనుకూల వ్యవసాయ పద్ధతుల అమలు వంటి వివిధ వ్యూహాల కలయిక అవసరం.
ఈ సమస్యను ఎదుర్కోవడానికి, మెట్ట ప్రాంతాల్లో ఇంకుడు చెరువులో పూడిక తీయడం, ఆ పూడిక మట్టిని ఎర్ర చల్కా నేలలకు వేయడం, మొదటి రుతుపవన వర్షాలు పడినప్పుడు వర్షపు నీరు కొట్టుకుపోకుండా పొలం అంచున గట్లు, కందకాలను ఏర్పర్చి వర్షపు నీటిని సేకరించి పునర్వినియోగించాలి.
ప్రణాళికాపరమైన వ్యూహాలను అమలుచేయాలి
తేమను నిలిపి ఉంచేందుకు ఎత్తైన మళ్ల పద్ధతిలో సాగు చేపట్టడం, అందుబాటులో ఉన్న నీటి వనరులు, పొంచివున్న నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకొని దానికి తగ్గట్టుగా విత్తనాలు వేసుకోవడం లేదా నాట్లు వేసుకోవాలి. నీటి ఎద్దడిని తట్టుకునే పంటలను, పంట రకాలను ఎన్నుకోవాలి. వర్మీ కంపోస్టింగ్ ద్వారా పంట వ్యర్థాల పునర్వినియోగం, కరువు నివారణకు ఆకులపై పోషకాలను పిచికారీ చేయడంలాంటి ప్రాంతీయపరమైన సాగుపద్ధతులు అవలంబించాలి.
అంచనాల ప్రకారం ఈ ఏడాది రుతుపవనాలు దాదాపుగా నిరాశపరచడం ఖాయం. మనం సమస్యను ప్రణాళికాబద్ధంగా ఎదుర్కోవాలి. నేడు భారతదేశం గణనీయమైన శాస్త్రీయ పరిజ్ఞానాన్ని, మెరుగైన వాతావరణ అంచనా సామర్థ్యాలను, ఉత్తమమైన పరిశీలన వ్యవస్థలను కలిగి ఉంది. ఈ సామర్థ్యాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవడమే ప్రస్తుతం అవసరం. కావున రాజకీయ సంకల్పం ద్వారా, సంస్థాగత వేగం, ప్రణాళికాపరమైన వ్యూహాలను స్థానికంగా అమలు చేయగలిగితే సమస్య నుంచి బయటపడవచ్చు.
- డా. రేపల్లె నాగన్న,
కన్సల్టెంట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
