నారాయణపేట ఎమ్మెల్యేలకు  ‘కృష్ణా నీళ్ల’ గండం!

నారాయణపేట ఎమ్మెల్యేలకు  ‘కృష్ణా నీళ్ల’ గండం!

నారాయణపేట, వెలుగు :  సరిగ్గా నాలుగేండ్ల కింద సీఎం బర్త్​డే గిఫ్టు గా ఏర్పడ్డ నారాయణపేట జిల్లా రాజకీయాలు నారాయణపేట, మక్తల్​ ఎమ్మెల్యేలు రాజేందర్​రెడ్డి, రామ్మోహన్​రెడ్డి చుట్టూ తిరుగుతున్నాయి. రెండు నియోజకవర్గాల్లోనూ ప్రతిపక్ష లీడర్లు బలంగా లేకపోవడంతో ఇద్దరు ఎమ్మెల్యేలకు ఎదురులేకుండా పోయింది. కానీ, గడిచిన నాలుగేండ్లలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగకపోవడం, కనీసం కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్​నిర్మాణం కూడా పూర్తికాకపోవడం రూలింగ్​పార్టీకి మైనస్​గా మారనుంది. అదే సమయంలో పక్కనే కృష్ణా నది ప్రవహిస్తున్నా సాగునీళ్లు లేక జిల్లాలో లక్ష ఎకరాల దాకా పడావుపడ్డాయి. 2018 ఎన్నికల ముందు పాలమూరు–రంగారెడ్డి, సంగంబండ, కరివేన ప్రాజెక్టుల ద్వారా సాగునీరిస్తామని చెప్పి గెలిచిన ఎమ్మెల్యేలు మాట నిలుపుకోలేకపోయారు. దీంతో ఈసారి ఓట్ల కోసం వెళ్తే కృష్ణా నీళ్లపై జనం ఎక్కడ నిలదీస్తారోననే భయం ఎమ్మెల్యేలను వెంటాడుతోంది. మరోవైపు రెండు నియోజకవర్గాల్లోనూ ప్రధాన ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్​పార్టీలకు బలమైన క్యాడర్ ఉన్నా లీడర్లు లేకపోవడం మైనస్​ పాయింట్. ఈ రెండు పార్టీల నుంచి టికెట్​ఆశిస్తున్న నేతలెవరూ ప్రజాసమస్యలపైగానీ, రూలింగ్​పార్టీ అవినీతి, అక్రమాలపై గానీ పెద్దగా పోరాటాలు చేయకపోవడం ఇరు పార్టీల క్యాడర్​ను కలవరపెడుతోంది.

పేట సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ వస్తదా? 

నారాయణపేటలో ఎమ్మెల్యే ఎస్​.రాజేందర్​రెడ్డి మరోసారి గెలిచి మంత్రి పదవి చేపట్టాలనే ఆశతో ఉన్నారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్​ నుంచి పోటీచేసి గెలిచిన రాజేందర్​ రెడ్డి వచ్చే ఎన్నికల్లో తనను సంక్షేమ పథకాలే గెలిపిస్తాయంటున్నారు. కానీ, సొంత పార్టీలోనే ఆయనపై వ్యతిరేకత ఉంది. సర్పంచ్​లకు చేసిన పనులకు సంబంధించి బిల్లులు ఇవ్వకపోవడంతో నిరాశతో ఉన్నారు. కేసీఆర్​కర్నాటక రాష్ట్రంలో బీఆర్ఎస్ ​బాధ్యతలను రాజేందర్​రెడ్డికే అప్పగించే అవకాశం ఉందని, ఈ క్రమంలో నారాయణపేట టికెట్ దక్కే అవకాశాలు ఉండకపోవచ్చని ఆ పార్టీ నాయకులంటున్నారు. సమీకరణాలు మారితే పేట బీఆర్​ఎస్​ టికెట్ ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్​రెడ్డికి ఇస్తారంటున్నారు. బీజేపీ నుంచి 2018 ఎన్నికల్లో రతంగ్​పాండురెడ్డి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. కొన్ని నెలల కింది వరకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించిన ఆయన తనకే టికెట్​వస్తుందన్న ఆశతో హఠాత్తుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అలాగే బీజేవైఎం మాజీ రాష్ట్ర నాయకుడు సత్యయాదవ్​ కూడా టికెట్​ఆశిస్తున్నారు. కాంగ్రెస్​ నుంచి కేవలం శివకుమార్​రెడ్డి మాత్రమే పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్​టికెట్​ఆశించినా రాకపోవటంతో బీఎల్ ఎఫ్​నుంచి పోటీ చేసి రాజేందర్​రెడ్డికి గట్టి పోటీనిచ్చారు. అయితే ఆయనపై మహిళా వేధింపుల కేసు ఉండడంతో సంవత్సరం నుంచి నియోజకవర్గంలో అడుగు పెట్టడం లేదు. కానీ, తన అనుచరులతో పార్టీ కార్యక్రమాలు నడిపిస్తున్నారు. కొంతకాలంగా కార్యకర్తల మధ్యకు కూడా వస్తుండడంతో పార్టీలో జోష్​పెరిగింది. ఈసారి ఎలాగైనా కాంగ్రెస్​ తరపున పోటీ చేసి గెలవాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్నారు.

మక్తల్​ బీఆర్​ఎస్​లో పోటా పోటీ   

2014లో కాంగ్రెస్​  నుంచి గెలిచిన చిట్టెం రాంమోహన్​ రెడ్డి తర్వాత టీఆర్ఎస్​లో చేరారు. అయితే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ​నుంచి టికెట్​ఆశించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. దీని కోసం ప్రయత్నాలు తీవ్రం చేశారు. ఇందులో భాగంగా చిట్టెం రాంమోహన్​రెడ్డి ప్రజాదరణ కోల్పోయారని, ఆయనకు టికెట్​ ఇస్తే ఓడిపోవడం ఖాయమని అధిష్టానానికి మెసేజ్​లు చేస్తున్నారు. డీసీసీబీ చైర్మన్ ​నిజాం పాషా, వర్కటం జగన్నాథ్​రెడ్డి, దేవరి మల్లప్ప బీఆర్ఎస్ టికెట్​ రేసులో ఉన్నారు. బీజేపీ తరపున గత ఎన్నికల్లో ఇండిపెండెంట్​గా పోటీ చేసిన జలంధర్​రెడ్డి, బీజేపీ నుంచి పోటీ చేసిన కొండయ్య మళ్లీ టికెట్​ఆశిస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య అంతర్గత​ పోరు నడుస్తున్నది. దీంతో జలంధర్​రెడ్డి ప్రతి గ్రామంలో పట్టుపెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్​ పార్టీకి మక్తల్​లో కేడర్​తో పాటు ఓటు బ్యాంకు కూడా ఉంది. ఈ పార్టీ నుంచి టికెట్​కోసం మాజీ అబ్కాబ్​ చైర్మన్​కొడుకు ప్రశాంత్​కుమార్​రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు వాకిటి శ్రీహరి, పీసీసీ సభ్యులు నాగరాజ్​గౌడ్​, చంద్రశేఖర్​రెడ్డి టికెట్​ఆశిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే దయాకర్​రెడ్డి కూడా మక్తల్​ టికెట్​ఆశిస్తున్నా ఏ పార్టీ నుంచి బరిలో నిలుస్తారన్నది తెలియడం లేదు.  

అభివృద్ధి కాలే.. సాగునీళ్లు రాలే 


నారాయణపేట జిల్లా 2019  ఫిబ్రవరి17న ఏర్పడింది. నాలుగేండ్లు గడుస్తున్నా కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసులు పూర్తికాలేదు. ప్రజల నుంచి విమర్శలు వస్తుండడంతో ఈ రెండు నిర్మాణాలకు ఇటీవలే శంకుస్థాపన చేశారు. కార్యాలయాలన్నీ అద్దె భవనాల్లో కొనసాగుతుండగా, ఆఫీసర్లంతా చుట్టపు చూపుగా వచ్చిపోతున్నారు. ఫుడ్​ప్రాసెసింగ్​పార్క్, ఇండస్ట్రియల్​పార్క్ నిర్మాణాలతో ఉపాధి కల్పిస్తామన్న హామీలేవీ నెరవేరలేదు. పీజీ,పాలిటెక్నిక్​కాలేజీలు, సైనిక్​ స్కూల్​ఏర్పాటు కాలేదు.  కృష్ణా -వికారాబాద్​ రైల్వే లైన్​సాధిస్తామని చెప్పిన హామీలదీ ఇదే పరిస్థితి. ఈ జిల్లాలో డబుల్​బెడ్​రూం ఇండ్లు ఒక్కటంటే ఒక్కటి కూడా నిర్మించలేదు. మరోవైపు కృష్ణా నది నుంచి నీళ్లు తెచ్చి నారాయణపేట జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్న ఎమ్మెల్యేల హామీలు ఉత్తవే అయ్యాయి. పాలమూరు-–రంగారెడ్డి పూర్తికాకపోవడంతో పాటు కరివేన ప్రాజెక్టు కాగితాలకే పరిమితమైంది. దీంతో జిల్లాలోని నారాయణపేట, ఉట్కూరు, ధన్వాడ, దామరగిద్ద, మద్దూరు, గుండుమాలు, కోస్గి, కొత్తపల్లి తదితర మండలాల్లోని  దాదాపు లక్ష ఎకరాలకు సాగునీరందడం లేదు. మక్తల్​లో సంగంబండ ప్రాజెక్టు ద్వారా ఊట్కూర్​కు నీళ్లిస్తామన్న ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్​రెడ్డి హామీ నెరవేరలేదు. దశాబ్ద కాలంగా మక్తల్, మాగనూర్​, నర్వలో లిఫ్టులు తుప్పుపట్టి మూలకు పడ్డా పట్టించుకునే నాథులు లేరు. ఇవన్నీ రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్​కు ప్రతికూలంగా మారే అవకాశముంది.