
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంపేటలోని 15.23 ఎకరాల లేఔట్లో ప్రజా అవసరాలకు కేటాయించిన స్థలంలో వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలంటూ అమర్ సొసైటీ వెల్ఫేర్ అసోసియేషన్ ఇచ్చిన వినతులను పరిష్కరించాలని జీహెచ్ఎంసీని హైకోర్టు ఆదేశించింది.
లేఔట్ పక్కనే ఉన్న దుర్గం చెరువు ఎఫ్టీఎల్ను తాజాగా స్థిరీకరించాలని ఆదేశించింది. దుర్గం చెరువుపై అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ఇందులో ప్రజా అవసరాలకు కేటాయించిన 1,334 చదరపు గజాల స్థలాన్ని రెండు ప్లాట్లుగా కొనుగోలు చేశామంటున్న ప్రైవేటు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
గుట్టల బేగంపేటలోని లేఔట్లో ప్రజా అవసరాలకు కేటాయించిన స్థలం ఆక్రమణలకు గురవుతోందని, వాటిని తొలగించి సౌకర్యాలు కల్పించాలంటూ 2017లో ఇచ్చిన వినతిపత్రాలపై చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ అమర్ సొసైటీ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ హైకోర్టులో 2018లో పిటిషన్ దాఖలు చేసింది. విచారించిన జస్టిస్ కె.లక్ష్మణ్.. ఇటీవల తీర్పు వెలువరించారు. వినతిపత్రాలను పరిష్కరించి వివరాలను సొసైటీకి తెలియజేయాలని జీహెచ్ఎంసీకి ఆదేశాలు జారీ చేశారు.