- కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్వీ, బీఎస్ఎఫ్ల మధ్య గొడవ
- ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంపై సీఎం దిష్టిబొమ్మ తగలబెట్టిన బీఎస్ఎఫ్ నేతలు
- తన నాయకుడి బొమ్మ దహనం చేస్తారా అంటూ కర్రలతో దాడి చేసిన టీఆర్ఎస్వీ నాయకులు
ఓయూ, వెలుగు: సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గురువారం ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త చోటుచేసుకుంది. టీఆర్ఎస్వీ నాయకులు, బీఎస్ఎఫ్ నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఒకవైపు టీఆర్ఎస్వీ నాయకులు కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు చేస్తుండగా, మరోవైపు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదంటూ బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ (బీఎస్ఎఫ్) నేతలుసీఎం దిష్టి బొమ్మను తగలబెట్టారు. తమ నాయకుడి దిష్టి బొమ్మను దహనం చేస్తారా అంటూ టీఆర్ఎస్వీ నాయకులు కర్రలు, రాళ్లతో బీఎస్ఎఫ్ కార్యకర్తలపై దాడికి దిగారు. దీంతో ఒక్కసారిగా క్యాంపస్లో టెన్షన్వాతావరణం నెలకొనడంతో బీఎస్ఎఫ్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. వారిని వ్యాన్లో ఎక్కించుకొని స్టేషన్కు తరలిస్తుండగా, కర్రలతో వచ్చిన టీఆర్ఎస్వీ నాయకులు వ్యాన్ను వెంబడించి డోర్లు తెరిచి వారిపై దాడి చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వ్యాన్లో ఉన్నవారిని వెంటనే స్టేషన్కు తరలించారు. ఏడేండ్లుగా ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఓయూలో సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడాన్ని తాము వ్యతిరేకించామని బీఎస్ఎఫ్ విద్యార్థి సంఘం అధ్యక్షుడు సంజయ్ అన్నారు. దీంతో టీఆర్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘం నాయకులు తమపై దాడులకు పాల్పడ్డారని చెప్పారు. వర్సిటీతో సంబంధం లేని వ్యక్తులు క్యాంపస్లో ఉంటూ తమపై దాడులు చేశారన్నారు. టీఆర్ఎస్వీ నాయకులు తమపై దాడులు చేస్తుంటే.. పోలీసులు చోద్యం చూస్తూ ఉన్నారన్నారు. కర్రలతో వీరంగం సృష్టించిన వారిని వదిలిపెట్టి తమను మాత్రం అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు.
నేడు క్యాంపస్ బంద్కు పిలుపు..
బీఎస్ఎఫ్ స్టూడెంట్లపై టీఆర్ఎస్వీ నాయకుల దాడులను నిరసిస్తూ శుక్రవారం ఉస్మానియా యూనివర్సిటీ బంద్కు స్టూడెంట్ సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ బంద్లో స్టూడెంట్లు స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరాయి.
దాడులను ఖండించిన విద్యార్థి సంఘాలు
ఓయూలో బీఎస్ఎఫ్ నేతలపై జరిగిన దాడులను విద్యార్థి సంఘాలు ఖండించాయి. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిరసన చేస్తున్న వారిపై టీఆర్ఎస్వీ నాయకులు దాడులకు పాల్పడటం సిగ్గుచేటని టీజేవీఎస్ అధ్యక్షుడు నిజ్జన రమేశ్ ముదిరాజ్ అన్నారు. బీఎస్ఎఫ్ నేతలపై దాడులను ఖండిస్తున్నట్లు వైఎస్సార్టీపీ విద్యార్థి విభాగం నాయకులు తెలిపారు. టీఆర్ఎస్ పాలేరులా వ్యవహరిస్తున్న వర్సిటీ వీసీ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులు సూసైడ్ చేసుకుంటుంటే.. సిగ్గు లేకుండా సీఎం జన్మదిన సంబురాలు ఎలా చేస్తున్నారని రీసెర్చ్ స్కాలర్ పాలడుగు శ్రీనివాస్ మండిపడ్డారు. టీఆర్ఎస్వీ నాయకులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు.