
ఇంజినీరింగ్ రీ వాల్యుయేషన్
ఫలితాలతో స్టూడెంట్లకు ఇక్కట్లు
టెక్నికల్ ప్రాబ్లమ్తో అందరికీ
ఒకే రకంగా మార్కులు
హైదరాబాద్/ఓయూ, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఇంజినీరింగ్ స్టూడెంట్ల రీవాల్యూయేషన్ ఫలితాల్లో గందరగోళం నెలకొంది. రిజల్ట్స్ ఈ నెల 3న విడుదలైనా టెక్నికల్ సమస్య వల్ల స్టూడెంట్లు ఇబ్బంది పడుతున్నారు. సంప్లిమెంటరీ పరీక్షలకు అప్లై చేసుకునేందుకు 19తో గడువు ముగుస్తుండటంతో పాస్ అయ్యామో, లేదో తెలియక ఆందోళన చెందుతున్నారు.
ఎవరికీ మార్కులు కలవలేదు..
ఓయూ పరిధిలోని వివిధ ఇంజినీరింగ్ కాలేజీల్లో 2,486 మంది రీ వాల్యుయేషన్కు అప్లై చేశారు. కానీ ఒక్కరికీ మార్కులు యాడ్ కాలేదు. చాలా మందికి ఒకే రకంగా మార్కులు వచ్చినట్లు గుర్తించారు. కొందరు తాము పరీక్షలు బాగా రాసినా ఫెయిల్ చేశారని, రీ వాల్యుయేషన్ కు అప్లై చేసినా మార్కులు కలవలేదని ఓయూ ఎగ్జామినేషన్ బ్రాంచీ అధికారులను కలిశారు. టెక్నికల్ సమస్య కారణంగా రీ వాల్యుయేషన్కు అప్లై చేసుకున్న వారందరికి కలిపిన మార్కులు అప్లోడ్ కాలేదని, పాత మార్కులే వెబ్సైట్లో కనిపించాయని అధికారులు కనుగొన్నారు. పైగా వివిధ సెమిస్టర్ల స్టూడెంట్ల మార్కులు సైతం ఒకే రకంగా చూపినట్లు తేల్చారు. రీ వాల్యుయేషన్లో ఎవరికీ అదనంగా మార్కులు కలవలేదని, రీవాల్యుయేషన్ మార్కుల మెమోలు అప్లోడ్ క్రమంలో తలెత్తిన సమస్యను పరిష్కరించి కొత్త మెమోలను సంబంధిత కాలేజీలకు పంపామని ఓయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ శ్రీరాం వెంకటేశ్అన్నారు. మార్చిన మెమోలను కాలేజీలకు పంపామని అధికారులు చెప్పినా.. ఇంకా అందలేదని స్టూడెంట్లు చెబుతున్నారు. మెమోలు అందే వరకైనా పరీక్ష ఫీజు తేదీలు పొడిగించాలంటున్నారు.