ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేస్తోన్న కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకుగాను కాంగ్రెస్ 125, ఎన్సీపీ 125 సీట్లలో పోటీకి దిగుతాయి. మిగిలిన 38 స్థానాల్లో యూపీఏ మిత్రపక్షాలకు కేటాయించారు. ఈ మేరకు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సోమవారం అధికారిక ప్రకటన చేశారు. ఎన్సీపీ తరఫున ఎక్కువ మంది కొత్తవాళ్లకు అవకాశం కల్పిస్తామని, కొన్ని చోట్ల సిట్టింగ్ సీట్లను పరస్పరం ఎక్స్చేంజ్ చేసుకుంటామని తెలిపారు. కాంగ్రెస్, ఎన్సీపీ నేతల సమావేశం తర్వాత పవార్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఎన్సీపీ చీఫ్ గత వారం ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ చీఫ్ సోనియాతో చర్చలు జరిపారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీచేశాయి.
కాంగ్రెస్ 42, ఎన్సీపీ 41 స్థానాల్ని గెల్చుకోగా, 122 సీట్లు సాధించిన బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. 63 సీట్ల శివసేన సపోర్ట్తో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. గతంలో విడివిడిగా పోటీచేసిన బీజేపీ, శివసేన ఈసారి కలిసే పోటీచేస్తామని ప్రకటించినా సీట్ల సర్దుబాటు చర్చలు ఇంకా కొలిక్కిరాలేదు. ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ కాంగ్రెస్, ఎన్సీపీ నుంచి బీజేపీలోకి చేరికలు పెరిగాయి. ఎన్సీపీ ఎంపీ ఉదయన్రాజే భోస్లే బీజేపీలో చేరడంపై పవార్ మండిపడ్డారు. కొంతమంది ఆత్మ గౌరవాన్ని కూడా తాకట్టుపెట్టి పార్టీ మారుతున్నారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలే వాళ్లకు బుద్ధి చెబుతారని పవార్ అన్నారు. వంచిత్ బహుజన్ అఘాడి (ప్రకాష్ అంబేద్కర్), స్వాభిమాన్ షెట్కారి సంఘటన, సమాజ్వాదీ లాంటి పార్టీలు యూపీఏ కూటమిలో చేరే అవకాశం ఉందని కాంగ్రెస్ నేత, మాజీ సీఎం పృధ్వీరాజ్ చవాన్ తెలిపారు.

