కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటే

కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటే

ఎనిమిది ఏళ్లలో ఏమి అభివృద్ధి చేశారో ప్రమాణం చేసి చెప్పాలని టీఆర్ఎస్ నేతలకు బీజేపీ జాతీయ నాయకుడు మురళీధర్ రావు సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్, అల్లుడు, కూతురిలలో ఎవరైనా ముందుకు వచ్చి చెప్పాలన్నారు. సిద్ధిపేటలో జనగోస - బీజేపీ భరోసా కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటేనన్నారు. రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని, కేసీఆర్ అంటే సిద్ధిపేట అని.. అన్నీ వచ్చాయని అనుకుంటున్నారని విమర్శించారు. కానీ .. అక్కడ కూడా ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. దేశంలో బాగా అవినీతి జరిగిన రాష్ట్రం ఏదని అంటే.. అది తెలంగాణ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి బాగా జరిగిందని ఆరోపించారు.

దేశ వ్యాప్తంగా ఉన్న సీఎంలలో బాగా బూతులు మాట్లాడే ముఖ్యమంత్రి కేసీఆర్ అని.. ఇలాంటి సీఎంను ఇంతవరకు తాను చూడలేదని విమర్శించారు. తెలంగాణను తిట్టిన వాళ్ళు ఇప్పుడు  మంత్రులు అయ్యారనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అందరికీ డబుల్ బెడ్ రూమ్ లు రావాలంటే సీఎం కేసీఆర్ జీవితం సరిపోదని.. వారి మనవడు కూడా సీఎం అయిన ఇవ్వలేడని సెటైర్ వేశారు. డబుల్ బెడ్ రూమ్ లు అనేది ఒక నాటకమని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని అబద్ధపు ప్రచారాలే జరిగాయన్నారు.