- ఎనిమిది మున్సిపాలిటీలకు అబ్జర్వర్ల నియామకం
హైదరాబాద్, వెలుగు: వాయిదాపడిన మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఇందుకోసం కాంగ్రెస్ తరపున అబ్జర్వర్లను పీసీసీ నియమించింది. ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఆమోదంతో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీలోని సీనియర్ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు అబ్జర్వర్లుగా బాధ్యతలు అప్పగించి, ఆయా మున్సిపాలిటీల్లో పార్టీ విజయాన్ని ఖాయం చేయాలని దిశానిర్దేశం చేశారు.
మున్సిపాలిటీల వారీగా చూస్తే.. తొర్రూరు బాధ్యతలను ఎంపీ రఘురాం రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజుకు అప్పగించారు. జనగాం మున్సిపాలిటీ గెలుపు బాధ్యతను ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ భుజానికెత్తుకోనున్నారు. ఇబ్రహీంపట్నం ఇన్చార్జీలుగా ఎమ్మెల్యేలు బాలు నాయక్, వీర్లపల్లి శంకర్ నియమితులయ్యారు.
క్యాతన్పల్లి మున్సిపాలిటీలో పార్టీని విజయతీరాలకు చేర్చే బాధ్యతను మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు పీసీసీ కట్టబెట్టింది. ఖానాపూర్ మున్సిపాలిటీకి విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే భూపతి రెడ్డిని ఇన్చార్జీలుగా నియమించారు. ఇంద్రేశం మున్సిపాలిటీ బాధ్యతలను ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, శ్రీగణేష్కు అప్పగించారు. కాగజ్నగర్ మున్సిపాలిటీ బాధ్యతను పి.సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే కె.ప్రేంసాగర్ రావుకు ఇచ్చారు.
