నామినేషన్ దాఖలు చేసిన పాల్వాయి స్రవంతి

నామినేషన్ దాఖలు చేసిన పాల్వాయి స్రవంతి

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్ దాఖలు చేశారు. చండూర్ లోని తహసీల్దార్ కార్యాలయంలో ఆమె కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేశారు. నామినేషన్ సందర్భంగా బంగారు గడ్డ గ్రామం నుంచి చండూర్ ఎమ్మార్వో కార్యాలయం వరకు పాల్వాయి స్రవంతి భారీ ర్యాలీగా తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే  సీతక్క, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రజల్ని వంచించి బీజేపీలో చేరిండు
మునుగోడు ఉప ఎన్నిక ధన బలానికి ప్రజా బలానికి మధ్య  జరుగుతున్న ఎన్నికలని పాల్వాయి స్రవంతి అన్నారు. నామినేషన్ అనంతరం మాట్లాడిన ఆమె.. ప్రజల్ని నైతికంగా వంచించి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని విమర్శించారు. మునుగోడు ఆడబిడ్డనైన తనను ఈ ధర్మ యుద్ధంలో గెలిపించాలని స్రవంతి కోరారు. పాల్వాయి గోవర్థన్ రెడ్డి ఆశయ సాధన కోసం కృషి చేస్తానన్న ఆమె.. కొంగుచాచి అడుగుతున్న  ఒక్క అవకాశం ఇవ్వండని మునుగోడు ప్రజలను అభ్యర్థించారు.

 

17 వరకు నామినేషన్ల ఉపసంహరణ   

మునుగోడు  ఉప ఎన్నికకు సంబంధించి ఈ నెల 7న ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ ఈ రోజుతో ముగియనుంది. శనివారం అధికారులు నామినేషన్లు పరిశీలించనున్నారు. ఈ నెల17వ  తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. నంబర్ 3న  మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుండగా.. నవంబర్ 6న ఓట్ల లెక్కింపు జరగనుంది.అదే రోజున ఫలితాలు వెలువడనున్నాయి.