నాగర్కర్నూల్, వెలుగు : మున్సిపల్ఎన్నికల ఓట్ల లెక్కింపు అనంతరం నాగర్కర్నూల్, కల్వకుర్తి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత వచ్చిన తర్వాత కూడా ఎందుకైనా మంచిదని మందు జాగ్రత్తగా గెలిచిన అభ్యర్థులను హైదరాబాద్లోని రిసార్టులకు తరలించారు. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో 24 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు18 స్థానాల్లో గెలుపొందారు.
బీఆర్ఎస్ అభ్యర్థులు ఆరు స్థానాలకు పరిమితమయ్యారు. బీసీ జనరల్కు రిజర్వ్ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ పదవికి ఇద్దరు పోటీపడగా రెండవ వార్డు నుంచి పోటీ చేసిన పొడుగు శ్రీనివాసులు ఓటమి పాలయ్యారు. తీగల సునేంద్ర గెలుపొందారు. చైర్పర్సన్ పదవి ఆయనకే దక్కుతుందన్న ప్రచారం జరుగుతున్నా చివరిలో ఏదైనా జరగొచ్చని సునేంద్ర మద్దతుదారులు అంటున్నారు. కల్వకుర్తి మున్సిపాలిటీలో 22 వార్డులకు గాను కాంగ్రెస్ అభ్యర్థులు13 వార్డులలో గెలుపొందారు.
జనరల్ మహిళకు రిజర్వ్ అయిన చైర్పర్సన్ పదవిని ఎన్నికలకు బృంగి రత్నమాలకు ఇస్తామని ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి ప్రకటించారు. జనరల్మహిళకు రిజర్వ్ చేసిన స్థానంలో బీసీ మహిళకు ఎందుకివ్వాలన్న చర్చ పార్టీలోని ఒక వర్గం స్టార్ట్ చేసినట్లు సమాచారం. కొల్లాపూర్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ బీసీ మహిళకు రిజర్వ్ చేశారు. 19 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ నుంచి 16 మంది అభ్యర్థులు గెలుపొందారు. చైర్పర్సన్పోస్టుకు దాదాపు ఆరుగురు పోటీపడుతుండగా వారిలో మేకల రమ్య, వంగ అనూష, శ్రీదేవి పేర్లు వినిపిస్తున్నాయి. కాగా, మంత్రి జూపల్లి ఎవరిని ఫైనల్ చేస్తారో అనే ఉత్కంఠ ఏర్పడింది.
