- మిడ్మానేరు లీకేజీలపై కాంగ్రెస్ ఫైర్
- తాత్కాలిక పనులతో సరిపెడితే ఊరుకోం
- మళ్లీ కట్టను కట్టేవరకు నీళ్లు నింపనివ్వం
- లోపాలపై న్యాయ విచారణ జరిపించాలి
- కాంగ్రెస్ నేతలు జీవన్రెడ్డి, పొన్నం డిమాండ్
- కట్టను పరిశీలించి..స్థానికులతో మాట్లాడిన నేతలు
మిడ్ మానేరు ప్రాజెక్టు లీకేజీలను సర్కారు పట్టించుకోవడం లేదని, తాత్కాలిక నిర్మాణాలతోనే సరిపెడుతోందని కాంగ్రెస్ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. మళ్లీ కట్టను కట్టాల్సిందేనని, నిర్మాణ వైఫల్యాలపై న్యాయ విచారణ జరిపించాల్సిందేనని డిమాండ్ చేశారు. తిరిగి కట్టను కట్టేవరకు నీళ్లు నింపనివ్వబోమని హెచ్చరించారు. మిడ్మానేరు ప్రాజెక్టు తెలంగాణకు గుండెకాయ అని చెప్తున్న ప్రభుత్వం.. అలాంటి గుండెకాయకు రంధ్రం పడినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఆదివారం మిడ్మానేరు కట్టను వారు సందర్శించారు. కట్టపై తిరుగుతూ లోపాలను అధ్యయనం చేశారు. కట్టపై వేసిన బోర్లను, ప్రాజెక్టులోని నీటిని, ప్రాజెక్టు లోపల జరుగుతున్న నీటి ఎత్తిపోతలను పరిశీలించారు. అనంతరం గ్రామ సర్పంచ్తో పాటు గ్రామస్తులతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: జీవన్రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టులో రెండు ప్రమాదాలు జరిగాయని, గత ఏడాది మేడారం చెరువులో, ప్రస్తుతం మిడ్మానేరులో అని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి మీడియాతో అన్నారు. వీటిని బట్టి చూస్తే నీటి పారుదల ప్రాజెక్టుల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్య ఏమిటో అర్థమవుతుందని దుయ్యబట్టారు. మిడ్మానేరు ఎడమ కట్ట మధ్యలో ఉన్న బోగమర్రి ఒర్రె ప్రాంతంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న రింగ్ బండ్ (వలయాకారపు కట్ట) తాత్కాలికం మాత్రమేనని, ఈ లీకేజీలపై పూర్తి శ్రద్ధచూపాలని డిమాండ్ చేశారు. వెంటనే మిడ్మానేరు కట్ట నిర్మాణ వైఫల్యానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేందుకు న్యాయ విచారణ జరిపించాలన్నారు. కట్టలో ఎలాంటి లోపం లేదని చెబుతున్న ప్రభుత్వం.. కట్టలోని బోగమర్రి ఒర్రె ప్రాంతంలో రింగ్బండ్ ఏర్పాటు చేయడాన్ని ఏమనుకోవాలని ప్రశ్నించారు. పూర్తిస్థాయిలో గ్రౌటింగ్ చేసి కట్టను మళ్లీ నిర్మించాలని డిమాండ్ చేశారు. కట్టలో లోపాల వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు బయపడుతూ బతకాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మాన్వాడ గ్రామంతో పాటు కందికట్కూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనంతరం మాన్వాడ గ్రామ ప్రజలతో మాట్లాడుతూ.. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. బోగమర్రి ఒర్రె ప్రాంతంలో కట్టను పూర్తి స్థాయిలో తొలగించి పునర్నిర్మించే వరకు మిడ్మానేరులో నీళ్లు నింపనిచ్చే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
వాస్తవాలు ప్రజలకు చెప్పాలి: పొన్నం
కాంగ్రెస్ పార్టీ మిడ్మానేరు నిర్మాణంలో తట్టెడు మట్టిని కూడా తీయలేదని ఆరోపించిన టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం మిడ్మానేరులో లోపాలు బయటపడిన తర్వాత 85 శాతం పనులు కాంగ్రెస్ హయాంలోనే అయ్యాయని చెప్పడం ఏమిటని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో ఉన్న ఈఎన్సీ మురళీధర్రావు ఇప్పుడు కూడా పని చేస్తున్నారని, అలాగే ఇరిగేషన్ సెక్రెటరీగా ఆనాడు ఉన్న ఎస్కే జోషీ ప్రస్తుతం సీఎస్ గా పని చేస్తున్నారని, వారిని అడిగి సందేహాలను నివృత్తి చేసుకోవాలని ప్రభుత్వానికి హితవుపలికారు. ప్రాజెక్టు కింద ఉన్న నాలుగైదు గ్రామాల ప్రజలు భయపడుతున్నారని, మిడ్మానేరు ప్రాజెక్టులోని వాస్తవాలను ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం, ముంపు గ్రామాల ఐక్య వేదిక అధ్యక్షుడు కూస రవీందర్, కన్వీనర్ పిల్లి కనకయ్య పాల్గొన్నారు.