కోకాపేటలో భూములకు ఇవాళ రెండో విడతలో ఈ వేలం జరగనుంది. ప్లాట్ నెంబర్ 15,16 లోని 9 ఎకరాల భూమికి ఆన్లైన్ వేలం నిర్వహించనున్నారు. ప్రారంభ ధరను రూ. 99 కోట్లుగా నిర్ణయించింది హెచ్ఎండీఏ.
నవంబర్ 25న జరిగిన మొదటి విడత వేలంలో రికార్డు స్థాయిలో ఎకరానికి 137.25 కోట్లు పలికిన సంగతి తెలిసిందే.. కోకాపేట నియోపోలిస్ లో 29 ఎకరాలతో పాటు మూసాపేట దగ్గర ఉన్న 16 ఎకరాల భూములకు వేలం వేసేందుకు సిద్దమైంది హెచ్ఎండీఏ.డిసెంబర్ 3, 5 తేదీల్లో మిగతా ప్లాట్లకు ఈ వేలం జరగనుంది. కోకాపేట్ నియోపోలీస్ ప్లాట్లకు ఎకరానికి 99 కోట్లు, కోకాపేట గోల్డెన్ మైల్ ప్లాట్లకు 70 కోట్లు, మూసాపేట్ ప్లాట్ల కు 75 కోట్ల చొప్పున ప్రారంభ ధరను నిర్ణయించింది హెచ్ఎండీఏ. ఈసారి భూముల వేలం ద్వారా భారీగా ఆదాయం వస్తుందని ఆశిస్తోంది హెచ్ఎండీఏ
కోకాపేటలోని నియోపోలిస్ లేఅవుట్లో ప్లాట్లను కొనుగోలు చేసే వారికి ఆకాశమే హద్దుగా ఎన్ని ఫ్లోర్లయినా నిర్మించుకునేందుకు అనుమతులు ఇస్తారు. ఈ లేఅవుట్లో అత్యాధునిక సదుపాయాలతో అభివృద్ధి చేశారు. దాదాపు 300 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు.40 ఎకరాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించారు. ఇందులో సైక్లింగ్ట్రాక్స్, 45 మీ. వెడల్పైన రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, విద్యుత్ సదుపాయాలను కల్పించారు. అలాగే కమర్షియల్, రెసిడెన్సీ, ఎంటర్టైన్మెంట్ల అవసరాలకు భవనాలు నిర్మించుకునేందుకు అనుమతించనున్నారు.
