బీఆర్ఎస్ నిర్ణయాలపై కాంగ్రెస్ సర్కార్ సమీక్ష

బీఆర్ఎస్ నిర్ణయాలపై  కాంగ్రెస్ సర్కార్ సమీక్ష

 

  • అప్పటి కేబినెట్ సమావేశాల్లో తీసుకున్న డెసిషన్స్​పై ఆరా
  • పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం
  • కొందరు మంత్రులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేట్లకు 
  • మేలు చేసేలా నిర్ణయాలు తీసుకున్నట్టు గుర్తింపు 

హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేబినెట్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలపై కాంగ్రెస్ సర్కార్ దృష్టిసారించింది. 2018 నుంచి మొన్నటి వరకు ఏయే నిర్ణయాలు తీసుకున్నారనే దానిపై పూర్తి నివేదిక పంపాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించినట్టు తెలిసింది. బీఆర్ఎస్ హయాంలో కేబినెట్ సమావేశాల్లో ఆమోదం పొందిన అన్ని విషయాలను బయటకు చెప్పలేదు. కేవలం సంక్షేమ పథకాలకు సంబంధించిన విషయాలనే మీడియాకు వెల్లడించారు. భూముల కేటాయింపులకు సంబంధించి తీసుకున్న అనేక నిర్ణయాలు రహస్యంగా ఉంచారు. బీఆర్ఎస్ సర్కార్ కు దగ్గరున్న బడా కంపెనీల ఓనర్లతో పాటు ఆ పార్టీ​ ప్రజాప్రతినిధులకు ఆర్థికంగా మేలు జరిగేలా కేబినెట్​లో కొన్ని నిర్ణయాలు​తీసుకున్నట్టు ప్రభుత్వం గుర్తించింది.

పీపీపీ మోడ్​లో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టిన ప్రాజెక్టులు, వివిధ ఇండస్ర్టీలు, కంపెనీలకు ఇచ్చిన భారీ సబ్సిడీలు, భూకేటాయింపులకు సంబంధించిన నిర్ణయాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టింది. కొన్ని కేబినెట్ నిర్ణయాలైతే కొందరు మంత్రులకు కూడా తెలియకుండానే తీసుకున్నట్టు తెలిసింది. 2018 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు జరిగిన నాలుగు మంత్రివర్గ సమావేశాలు, ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మొన్నటిదాకా జరిగిన కేబినెట్ మీటింగుల్లో ఏమేం నిర్ణయాలు తీసుకున్నారనే వివరాలను కాంగ్రెస్ సర్కార్ సేకరిస్తున్నది. అసలు మంత్రివర్గ ఆమోదం లేకుండా, బడ్జెట్​లో పెట్టకుండా ఖర్చు చేసిన నిధులెన్ని అనే దానిపైనా ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా ఇరిగేషన్​ప్రాజెక్టులకు సంబంధించి ఎప్పుడెప్పుడు? ఏమేం అప్రూవల్స్ ఇచ్చారనే దానిపై వివరాలు తెప్పించుకుంటున్నది. 

అధికార, నిధుల దుర్వినియోగం.. 

బీఆర్ఎస్ హయాంలో కేబినెట్ సమావేశాల్లో తీసుకున్న అన్ని ముఖ్యమైన నిర్ణయాలను సమీక్షించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఎక్కడెక్కడ అధికార, నిధుల దుర్వినియోగం జరిగిందనే దానిపై ఫోకస్ పెట్టింది. దానికి అనుగుణంగా చర్యలు తీసుకోనున్నట్టు తెలిసింది. ఆ నిర్ణయాలు తీసుకుని, వాటిని ఎందుకంతా గోప్యంగా ఉంచారనేది కూడా తేల్చనుంది. నిజానికి గత బీఆర్ఎస్ సర్కార్​కేబినెట్ నిర్ణయాలతో పాటు వేలాది జీవోలను రహస్యంగా ఉంచింది. ఒకానొక సమయంలో జీవోలు, కేబినెట్ నిర్ణయాలపై హైకోర్టు కలుగజేసుకుని హెచ్చరించినా.. ఆ ఆదేశాలను కూడా పట్టించుకోలేదు. ఆర్టీసీ కార్మికుల సమ్మె సమయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఆర్టీసికి సంబంధించిన చాలా రూట్లను ప్రైవేట్​పరం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ విషయం బయటకు రాలేదు.  కానీ ఆ తర్వాత ఒకట్రెండు రోజులకే సంబంధిత ఆఫీసుల్లో ఫైళ్లు మూవ్ చేస్తున్న టైమ్ లో అది బయటపడింది. దీనిపై హైకోర్టులో పిల్​దాఖలైంది. విచారణ సందర్భంగా హైకోర్టు కీలక కామెంట్ల చేసింది. కేబినెట్ నిర్ణయాలను ఎందుకు రహస్యంగా ఉంచారని అప్పటి ఏజీని ప్రశ్నించింది. కేబినెట్​నిర్ణయాలను ప్రజలకు చెప్పాలని పేర్కొంది.

కొందరికి మేలు జరిగేలా.. 

బీఆర్ఎస్​ హయాంలో కేబినెట్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలతో అప్పటి మంత్రులు ఐదారుగురు, మరికొందరు ఆ పార్టీ ప్రజాప్రతినిధులకు లబ్ధి జరిగినట్టు ప్రభుత్వం భావిస్తున్నది. పార్టీ నేతల బంధువులకు, కార్పొరేట్ మిత్రులకు కొన్నిచోట్ల విలువైన భూములను కట్టబెడుతూ నిర్ణయాలు తీసుకున్నట్టు గుర్తించింది. వీరిలో మేడ్చల్ మల్కాజిగిరి, నిజామాబాద్,  కరీంనగర్, ఖమ్మం, మహబూబ్​నగర్, నల్గొండ జిల్లాలకు చెందిన మంత్రులు, వారి బంధువులు ఉన్నట్టు సమాచారం. ఇలా లబ్ధి పొందిన ప్రజాప్రతినిధుల్లో కొందరు మళ్లీ ఎమ్మెల్యేలుగా గెలిచినోళ్లు కూడా ఉన్నారు. ఇలా తమకు దగ్గరున్నోళ్లకు లబ్ధి చేకూరేలా అప్పటి బీఆర్ఎస్ సర్కార్ 2018లో అధికారంలోకి వచ్చిన తర్వాతే ఎక్కువగా నిర్ణయాలు తీసుకున్నట్టు గుర్తించారు. పాలసీ నిర్ణయాల కంటే సొంత లబ్ధి కోసం జరిగిన నిర్ణయాలే ఎక్కువ ఉన్నాయని, వాటిని పున:సమీక్షించాలని ప్రభుత్వం భావిస్తున్నది. సీఎం రేవంత్​రెడ్డి కూడా అసెంబ్లీ ఎన్నికల ముందు గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షిస్తామని చాలాసార్లు ప్రకటించారు.