- హైదరాబాద్లోని సరూర్నగర్లో నిర్వహిస్తం..
- ప్రియాంకా గాంధీ వస్తరు
- పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై వరుసగా నిరుద్యోగ నిరసన దీక్షలు చేపడ్తామని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ప్రకటించారు. ఈ నెల 21న నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో, 24న ఖమ్మంలో, 26న ఆదిలాబాద్లో దీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. మే 4 లేదా 5న హైదరాబాద్ సరూర్నగర్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, ఆ సభకు ప్రియాంకా గాంధీ ముఖ్య అతిథిగా వస్తారని చెప్పారు. ఎల్బీననగర్లోని శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళులర్పించి, భారీ ర్యాలీగా సరూర్నగర్ స్టేడియానికి చేరుకుంటామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో ఈ సభలో యువతకు వివరిస్తామని తెలిపారు. కర్నాటక ఎన్నికల్లో ప్రియాంకా గాంధీ బిజీగా ఉన్నారని, అక్కడి నుంచి హైదరాబాద్కు వస్తారని, ఆమె పర్యటనపై రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందని పేర్కొన్నారు. మంగళవారం గాంధీభవన్లో మీడియాతో రేవంత్ మాట్లాడారు. మే 9 నుంచి తన రెండో విడత ‘హాత్ సే హాత్ జోడో యాత్ర’ను జోగుళాంబ గద్వాల జిల్లా నుంచి ప్రారంభిస్తానని చెప్పారు.
పేపర్ల లీకేజీ కేసును సీబీఐతో విచారణ జరిపించాలి
‘‘ఇంటికో ఉద్యోగమిస్తామంటూ హామీ ఇచ్చిన కేసీఆర్.. కనీసం ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదు. కానీ, తన ఇంట్లో మాత్రం నాలుగైదు ఉద్యోగాలిచ్చుకున్నడు” అని రేవంత్ మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పాపం సర్కార్దేనని అన్నారు. కేసును సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో చిన్న ఉద్యోగులను ఇరికించి అసలు నిందితులను తప్పిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర అధికారులు ఈ కేసును విచారిస్తే అసలు నిజాలు బయటకు రావని, ప్రభుత్వంలోని పెద్దలను కాపాడుకునేందుకే ప్రతి కేసులోనూ రాష్ట్ర సర్కారు సిట్ వేస్తున్నదని విమర్శించారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో కేటీఆర్ను బర్తరఫ్ చేయాలని, కమిషన్పై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే గవర్నర్ను కోరామని, అయినా గవర్నర్ చర్యలు తీసుకోలేదని అన్నారు. తమ పోరాటం వల్లే కేసును ఈడీ విచారిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతోనే తెలంగాణ ఉద్యమం సాగిందని గుర్తు చేశారు. ఆ నినాదంతో ఎంతో మంది యువతీ యువకులు ఉద్యమిస్తేనే రాష్ట్రం వచ్చిందని, కానీ, సాధించుకున్న రాష్ట్రంలోనే ఇప్పుడు యువత సమిధగా మారుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రేస్ కోర్స్ రోడ్డులో సంజయ్ ర్యాలీ తియ్యాలి
యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో దేశంలో ప్రధాని మోడీ, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు. ‘‘ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చి మోడీ అధికారంలోకి వచ్చారు. ఈ లెక్కన ఇప్పటిదాకా 20 కోట్ల ఉద్యోగాలు రావాలి. కానీ, మాటను నిలబెట్టుకోకుండా మోడీ మోసం చేశారు’’ అని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన రోజే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ బండి సంజయ్ అంటున్నారని, ఆయన మాటలు వింటే నవ్వాల్నో.. ఏడ్వాల్నో తెలియడం లేదని రేవంత్ విమర్శించారు.
టెన్త్ పేపర్ లీక్ కేసులో అరెస్టయిన సంజయ్ ఆ మరుసటి రోజే విడుదలయ్యారని, కానీ, నిరుద్యోగుల కోసం పోరాడుతున్న కాంగ్రెస్ లీడర్లను మాత్రం ఐదు రోజులు జైల్లో ఉంచారని అన్నారు. ‘‘లీకుల్లో ఇరుక్కున్న సంజయ్ నిరుద్యోగ నిరసన ర్యాలీలు తీస్తున్నరు. నిజంగా సంజయ్కి చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో ప్రధాని నివాసముండే రేస్కోర్స్ రోడ్డులో నిరసన ర్యాలీ తియ్యాలి” అని రేవంత్ సవాల్ విసిరారు. ‘‘హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు బండి పోతే బండి ఇస్తామంటూ హామీ ఇచ్చిన సంజయ్.. ఆ తర్వాత ఆ ముచ్చట్నే పట్టించుకోలేదు. ఆ హామీతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్ధి పొందారు.. ఆ తర్వాత ఇన్సూరెన్స్ ఉంది కదా అంటూ దాటవేశారు” అని దుయ్యబట్టారు.