గాంధీ భవన్లో ముఖాముఖిరోజూ ఇద్దరు నేతలు..ప్రజల వినతులను స్వీకరించి పరిష్కారానికి కృషి  : మహేశ్ గౌడ్

గాంధీ భవన్లో ముఖాముఖిరోజూ ఇద్దరు నేతలు..ప్రజల వినతులను స్వీకరించి పరిష్కారానికి కృషి  : మహేశ్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: ప్రజలకు మరింత అందుబాటులో ఉండేందుకు  కాంగ్రెస్ నేతలు పలు కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే గాంధీ భవన్ లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం కొనసాగిస్తున్న పీసీసీ.. ఇప్పుడు తాజాగా ప్రతిరోజు ఇద్దరు నేతలు గాంధీ భవన్ లో ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. పార్టీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఈ కొత్త కార్యక్రమానికి మంగళవారం నుంచి శ్రీకారం చుట్టనున్నారు. ప్రతి రోజు ఇద్దరు పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు ఇందులో పాల్గొనాలని  ఆదేశాలిచ్చారు.

నిత్యం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు  ఇద్దరు నేతలు గాంధీ భవన్ లో అందుబాటులో ఉంటూ ప్రజల నుంచి వచ్చిన వివిధ రకాల సమస్యలను వినతి పత్రం రూపంలో  తీసుకోనున్నారు. ఆ తర్వాత వాటిని సంబంధిత శాఖ మంత్రులకు పంపిస్తూ, ఆ సమస్యలను పరిష్కారం అయ్యే వరకు వారితో ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ ఉంటారు. రానున్న రోజుల్లో కార్పొరేషన్ చైర్మన్ లతో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ ప్రోగ్రామ్ లో  పాల్గొననున్నారని పీసీసీ ప్రకటించింది.

మంగళవారం ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా, ఆగ్రోస్ చైర్మన్ కాసుల బలరాజు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పీసీసీ సోమవారం ఓ  ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.