
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలోని నాలుగు కోట్ల మంది ప్రజలు చెప్పుతో కొట్టినట్టు ఎన్నికల్లో ఓడించినా బీఆర్ఎస్ నేతలకు బుద్ధి రాలేదని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని.. లేకుంటే ప్రజలు పండపెట్టి తొక్కుతరని హెచ్చరించారు. ఇకపై కూడా ఆ పార్టీ పవర్లోకి వచ్చే అవకాశం లేదని ఆయన అన్నారు. ఈ మేరకు సోమవారం దయాకర్ మీడియాకు ఓ వీడియో రిలీజ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే గులాబీ నేతలు తట్టుకోలేకపోతున్నారని ఆయన అన్నారు.
ఫ్రస్టేషన్లో ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వాన్ని విమర్శించే నేతలను తన్ని తరిమేసే పరిస్థితి తెచ్చుకోవద్దని వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ సన్నాసిగాళ్ల మాటలను ప్రజలు పట్టించుకోవద్దన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ అండ్ టీం ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని సూచించారు. రెచ్చగొట్టే మాటల ద్వారా తమను అభాసుపాలు చేయాలని చూస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ అవినీతిని మొత్తం బయటకు తీస్తామని చెప్పారు. గులాబీ నేతలు విద్వేషం, విషం చిమ్మే పనులు చేస్తున్నారని.. వారిపై తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. కేటీఆర్ బలుపుతోనే బీఆర్ఎస్ను ఎన్నికల్లో ఓడించారని.. ఇప్పటికైనా కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని అద్దంకి దయాకర్ హెచ్చరించారు.