రావుగోపాల్‌రావు, అమ్రిష్‌పురిలను మించి జగన్, కేసీఆర్‌‌ల నటన

రావుగోపాల్‌రావు, అమ్రిష్‌పురిలను మించి జగన్, కేసీఆర్‌‌ల నటన
  • హుజూరాబాద్‌ ఎన్నికల్లో లబ్ధి కోసమే ఇద్దరూ డ్రామాలాడుతున్నారు
  • జల వివాదంతో ప్రజల్లో మనోభావాలు రెచ్చగొడుతున్నారు: దాసోజు శ్రవణ్

హైదరాబాద్: నదీ జలాల వివాదంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావాలనే డ్రామా చేస్తున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఏపీ సీఎంవైఎస్ జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా రెండు ప్రాంతాల ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారన్నారు. ఇద్దరూ నటనలో రావుగోపాల్ రావు, అమ్రిష్ పురిలను  మించిపోయారన్నారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఇప్పుడు రెండు రాష్ట్రాల నేతల మధ్య నడుస్తున్న జల జగడం అంతా పెద్ద డ్రామా అన్న విషయం గతంలో జరిగిన విషయాలను గమనిస్తే అర్థమవుతుంది. రాయలసీమకు వెళ్లినప్పుడు కేసీఆర్ రతనాల సీమ చేస్తాన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్‌ను గెలిపించేందుకు కేసీఆర్ డబ్బులు పంపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి జగన్ పిలిచారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఏకంగా కేసీఆర్ కాళ్లక మొక్కారు. ఇవన్నీ ప్రజలు మర్చిపోలేదు. జగన్, కేసీఆర్ డ్రామాలకు ఎవరూ బలికావొద్దని కోరుతున్నా. ఒకరికొకరి స్వీట్లు తినిపించుకున్న కేసీఆర్, జగన్‌లు ఇప్పుడే ఎందుకు డ్రామాలు ఆడుతున్నారో గుర్తించాలి. ప్రజల మధ్య భావోద్వేగాలు రెచ్చగొట్టి హుజూరాబాద్ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే ఈ డ్రామాలు” అని దాసోజు శ్రవణ్ అన్నారు. 
ఆ ప్రాజెక్టులు పూర్తయితే జగన్ జలదోపిడీతో ఇబ్బంది ఉండదు
ఏపీ ప్రభుత్వం సంగమేశ్వరంపై జీవో ఇచ్చి రెండేండ్లు గడిచిపోయిందని దాసోజు శ్రవణ్ గుర్తు చేశారు. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉండి, ఇప్పుడే ఎందుకు ఎగిరెగిరి పడుతున్నారో ప్రజలకు తెలుసన్నారు. కేసీఆర్‌‌కు చిత్త శుద్ధి ఉంటే కృష్ణా నదీ బేసిన్‌లో ఉండే ప్రాజెక్ట్స్ పనులన్నీ పూర్తి చేసేవారని, అలా చేస్తే జగన్ జల దోపిడీ చేసినా తెలంగాణకు ఎటువంటి ఇబ్బందీ ఉండేదికాదని ఆయన అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ 20 శాతం పూర్తి కాకుండానే కేసీఆర్ సర్కారు వంద శాతం ఎస్టిమేట్స్ పెంచిందని, పనులు పూర్తి చేయలేదని విమర్శించారు. జగన్ జల దోపిడీ చేయక పోతే కేసీఆర్‌‌కు ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టే అవకాశం ఉండదని, అందుకే కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా, జగన్‌కు జల దోపిడీ చాన్స్ ఇచ్చారని దాసోజు ఆరోపించారు. దీంతో ఇద్దరు సీఎంలూ రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. జగన్, కేసీఆర్‌‌ల డ్రామాలకు ప్రజలు మోసపోవద్దని, ఎక్కడికక్కడ గల్లా పట్టి అడగాలని సూచించారు.