రాష్ట్రం వచ్చాక జరుగుతున్న అవినీతిపై కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్ మండిప్డడారు. ఇవాళ ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్ పై రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ.. ప్రాజెక్ట్ల పేరుతో కేసీఆర్ ఆంధ్రోళ్లకు దోచిపెడుతున్నారన్నారు. టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ వారి అస్తులు పెంచుకుంటున్నారని ఆరోపించారు. కాళేశ్వరం పాజెక్టు పేరుతో వేల కోట్ల అవినీతి జరిగిందన్నారు. ప్రజలకు ప్రశ్నించే అధికారం లేకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ అణచివేస్తున్నారన్నారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది.. తన వ్యక్తిగత ఆస్తులు పెంచుకోవడానికి, తన బంధువులకు పదవులు కట్టబెట్టడానికే అని ఫైర్ అయ్యారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ను అరెస్టు చేస్తే కల్వకుంట్ల కుంటుంబం చేసిన అవినీతి భాగోతం బయటకొస్తుందన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెలేలు,మంత్రులు అవినీతి చేసి భవనాలు కట్టించుకుంటున్నారని... కానీ పేద ప్రజలకు ఇంతవరకూ డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేదని ఆరోపించారు. టీఆర్ఎస్ చేసే అవినీతితో మొత్తం తెలంగాణకే నష్టం జరుగుతుందన్నారు. ఈ అవినీతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రశ్నించే బాధ్యత మనందరిపై ఉందన్నారు.