సూరత్ : పరువునష్టం కేసులో కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ అప్పీల్కు వెళ్లనున్నారు. తనను దోషిగా తేల్చి రెండేండ్ల జైలు శిక్ష విధిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును పైకోర్టులో సోమవారం సవాల్ చేయనున్నారు. ‘‘రాహుల్ గాంధీ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సూరత్లోని సెషన్స్ కోర్టుకు వస్తారు. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అప్పీల్ పిటిషన్ వేస్తారు” అని ఆయన తరఫు లాయర్ కిరీట్ పన్వాలా ఆదివారం తెలిపారు.
కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా సూరత్కు వస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ‘మోడీ ఇంటి పేరు’పై రాహుల్ చేసిన కామెంట్లపై పరువునష్టం కేసు నమోదైంది. రాహుల్ను దోషిగా తేల్చిన ట్రయల్ కోర్టు.. రెండేండ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన లోక్ సభ సభ్యత్వం కోల్పోయారు.