వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
జోగిపేట, వెలుగు: స్థానిక ఉపాధి కల్పించేందుకు జోగిపేట పరిసర ప్రాంతాల్లోనే కుటీర పరిశ్రమలు ఏర్పాటుకు కృషి చేస్తానని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా అన్నారు. ఆదివారం ఆయన అందోల్- జోగిపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా 1,4,5,6,7,8,9 వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతోందన్నారు. జోగిపేట అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు.
అందోల్ శివారులో 400 కుటుంబాలకు ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో మహిళలను పట్టించుకోలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహిళలకు ఉచిత బస్సు, రూ.500కే గ్యాస్ సిలిండర్ , వడ్డీలేని రుణాలు అందింస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి కోరారు.
