
హైదరాబాద్: పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపడం రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉన్నా సీఎం కేసీఆర్ తన బాధ్యతను కేంద్రంపై నెట్టేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఈ అంశంపై ఆమె ఈ రోజు (సోమవారం) మాట్లాడుతూ.. కుర్చీ వేసుకొని కూర్చుని పోడు భూముల సమస్య పరిష్కరిస్తానన్న కేసీఆర్.. ఇప్పుడు చేతులెత్తాశారని మండిపడ్డారు. పోడు భూములపై అచ్చంపేట నుంచి ఆదిలాబాద్ వరకు ఆందోళనలు జరుగుతున్నాయని సీతక్క చెప్పారు. పోడు భూముల అంశంపై కనీసం అసెంబ్లీలో చర్చకు కూడా అవకాశం ఇవ్వకపోవడాన్ని వ్యతిరేకిస్తున్నామని ఆమె అన్నారు.
పోడు భూములకు పట్టాలు ఇస్తానన్న కేసీఆర్ ఏడేళ్లయినా ఇవ్వకపోవడం దారుణమని సీతక్క అన్నారు. ఈ సమస్య పరిష్కారం రాష్ట్రం పరిధిలోనే ఉందని ఆమె చెప్పారు. పోడు భూములను సాగు చేసుకుంటున్న వారికి ఇప్పటికైనా పట్టాలు ఇవ్వాలని, లేదంటే టీఆర్ఎస్ నాయకులను ప్రతి చోటా అడ్డుకుంటామని హెచ్చరించారు.