- పోలీసులకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు
హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్సీ కవిత చేసిన అవినీతి ఆరోపణల ఆధారంగా బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, సంతోష్ రావు, నవీన్ రావు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిపై వెంటనే కేసు నమోదు చేయాలని పోలీసులను కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కోరారు. శనివారం ఆయన హైదరాబాద్ నారాయణగూడ పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం వెంకట్ మాట్లాడుతూ..కవిత చేసిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకొని వెంటనే ఈ నలుగురిపై అవినీతి, అధికార దుర్వినియోగం కేసులు నమోదు చేయాలని కోరారు.
లక్షల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి సీఎం అయిన కేసీఆర్ కూతురుగా, ఎమ్మెల్సీగా కవిత కూడా భాగస్వామిగా ఉన్నారని తెలిపారు. అందువల్ల ఆమె ఆరోపణలు చేసిన నలుగురిపై ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కేసులు పెట్టాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఎమ్మెల్సీ వెంకట్ పేర్కొన్నారు.
