
- ఏసీబీ నోటీసులతో అసహనంతో ఉన్నరు: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: ట్విట్టర్ టిల్లుకు ఇంగ్లిష్ ఫుల్లు.. సబ్జెక్టు మాత్రం నిల్లు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం గాంధీ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. కేటీఆర్కు ఫార్ములా ఈ రేస్లో ఏసీబీ అధికారులు నోటీసులివ్వడంతో తీవ్ర అసహనానికిలోనై, సీఎం రేవంత్ రెడ్డిపై అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వైట్ ఛాలెంజ్కు రావాలని గతంలో కేటీఆర్ను రేవంత్ రెడ్డి సవాల్ చేస్తే.. రాకుండా పారిపోయారని, ఇప్పుడు సీఎంను ఛాలెంజ్ చేసే నైతికత ఆయనకు ఎక్కడిదని ప్రశ్నించారు.
సీఎంపై కేటీఆర్ చేస్తున్న విమర్శల్లో అవివేకం కనిపిస్తుందని విమర్శించారు. కేటీఆర్కు ఏసీబీ నోటీసులిస్తే.. మా వర్కింగ్ ప్రెసిడెంట్కు నోటీసులా అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించిన తీరు చూస్తే, ఇప్పుడు ఆమె బీఆర్ఎస్లోనే ఉన్నరా అనే అనుమానం కలుగుతున్నదన్నారు. మరి కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని విమర్శించిన కవిత, ఆ దయ్యం కేటీఆర్యేనా అని ప్రశ్నించారు. ఇన్ని రోజులు లేఖ పేరుతో డ్రామాలు ఆడిన కవిత, ఇప్పుడు కేటీఆర్ నోటీసులకు స్పందించడంతో ఆమె ఆడిన డ్రామాలకు తెరపడినట్లేనా అని అడిగారు.
కాళేశ్వరం ప్రాజెక్టును అంత అద్భుతంగా కడితే పీసీ ఘోష్ కమిషన్ వేయాల్సిన అవసరం కాంగ్రెస్కు ఎందుకు వచ్చిందన్నారు. ప్రాజెక్టు కూలినందుకే కమిషన్ వేయాల్సి వచ్చిందని, కమీషన్లకు కక్కుర్తి పడడంతోనే కేసీఆర్ కమిషన్ ముందుకు వచ్చారన్నారు.
ఏసీబీ నోటీసులతో కేటీఆర్ హడలిపోతున్నడు: ఆది శ్రీనివాస్
ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ అధికారులు నోటీ సులు ఇవ్వగానే కేటీఆర్ హడలిపోతున్నాడని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. విచారణకు హాజరవుతానని ఓ వైపు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే.. బడాయి మాటలు మాట్లాడుతున్నారన్నారు. కేటీఆర్కు ఏసీబీ నోటీసులు ఇస్తే.. సీఎం రేవంత్ రెడ్డిని నార్కో ఎనాలసిస్ టెస్టులకు రమ్మని సంబంధం లేని ఛాలెంజ్ చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరి మీద కేసు ఉంటే వాళ్లు విచారణకు హాజరవుతారు తప్ప, ఇంకొకరు వచ్చి నార్కో టెస్టులు చేసుకోరన్నారు. ఛాలెంజ్లు విసిరి పారిపోయిన చరిత్ర కేటీఆర్ది అని శనివారం ఓప్రకటనలో విమర్శించారు.