- ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు: ఆర్ఎస్ఎస్ శ్రేణులు, బీజేపీ నేతలు వారి సమావేశాల్లో వందేమాతరం గేయాన్ని ఆలపిస్తారా? అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పుడు అకస్మాత్తుగా వందేమాతరంపై పార్లమెంట్ లో చర్చపెట్టి.. మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, కాంగ్రెస్ పార్టీపై విష ప్రచారం చేయాలని బీజేపీ చూస్తోందని ఆయన దుయ్యబట్టారు. సోమవారం పార్లమెంట్ లో ఆయన మాట్లాడారు. బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా కాంగ్రెస్ నాయకులపై విష ప్రచారం చేస్తోందని విమర్శించారు.
బీజేపీ.. చరిత్రను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. 1896 లో రవీంద్రనాథ్ ఠాగూర్ దేశ ప్రజల కోసం కాంగ్రెస్ సెషన్స్ లో వందేమాతరం పాడారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏఐసీసీ, పీసీసీ, డీసీసీ సమావేశాల్లో వందేమాతరం గేయాన్ని పాడుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున తాము చర్చలో పాల్గొని ప్రజలకు వాస్తవాలు తెలియజేశామన్నారు.
