హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇస్తున్నట్టు కేటీఆర్ నిరూపించాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్విసిరారు. సబ్స్టేషన్లలో లాగ్ బుక్కులు తీసుకొచ్చి చూపించాలన్నారు. రాష్ట్ర ప్రజల కోసం అవసరమైన తాను కరెంట్తీగలనైనా పట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. ఆలేరు నియోజక వర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు.. హైదరాబాద్లోని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. గృహలక్ష్మి ఇస్తానన్న కేసీఆర్.. దాన్ని గాలికి వదిలేశారన్నారు. కేసీఆర్ ప్రకటించిన పథకాలన్నీ బీఆర్ఎస్ కార్యకర్తలకే అందుతున్నాయని ఆరోపించారు. సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అందరికీ ఉపయోగపడే పథకాలని చెప్పారు. డబ్బుల విషయంలో కాంగ్రెస్ పోటీ పడలేదని, కానీ, పథకాల్లో మాత్రం పోటీ పడుతుందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ పథకాలు అమలు కాకుంటే.. తన పదవులన్నింటికీ రాజీనామా చేస్తానన్నారు. మేనిఫెస్టోలో అన్ని వర్గాలకూ న్యాయం చేస్తామని తెలిపారు. మరో రెండు రోజుల్లో కాంగ్రెస్ టికెట్లు ఖరారవుతాయన్నారు. యాదగిరిగుట్ట నుంచే తాను ప్రచారం ప్రారంభిస్తానని చెప్పారు. ఆలేరుకు ఎమ్మెల్యే కన్నా తానే ఎక్కువ సార్లు వచ్చానన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు నిజమని, ఇప్పటికీ బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని ఆయన అన్నారు. కేసీఆర్ బండారాన్ని మోదీ బయటపెట్టారన్నారు.