అలీగఢ్: హత్రాస్ తొక్కిసలాట పెను దుర్ఘటన అని కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ అన్నారు. అధికార యంత్రాంగం వైఫల్యమే ఈ దుర్ఘటనకు కారణమని చెప్పారు. భోలే బాబా సత్సంగ్కు వేలాది మంది భక్తులు వస్తారని తెలిసినా సరైన ఏర్పాట్లు చేయలేదని అన్నారు. అయితే, దీనిని తాము రాజకీయం చేయదల్చుకోలేదని, బాధితులందరికీ న్యాయం జరగాలని అన్నారు. ఇంతమంది ప్రాణాలు తీసిన పరిస్థితులను అర్థం చేసుకోవాలని కోరారు. శుక్రవారం ఉదయం రాహుల్గాంధీ ఢిల్లీ నుంచి రోడ్డు మార్గంలో ఉత్తర ప్రదేశ్లోని అలీగఢ్ కు చేరుకున్నారు.
అక్కడ బాధితుల ఇండ్లకు వెళ్లి వారిని పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం హత్రాస్ చేరుకొని అక్కడి బాధితులను ఓదార్చారు. బాధితుల కుటుంబ సభ్యులు రాహుల్తో తమ ఆవేదన చెప్పుకున్నారు. కొందరు ఆయనను హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. అందరితోనూ మాట్లాడిన రాహుల్ వాళ్లకు ధైర్యం చెప్పారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేకంగా చొరవ చూపించి, ఈ పేద కుటుంబాలకు సాయం అందించాలని కోరారు. యూపీ సర్కారు నుంచి సహాయం అందేలా చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీ తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తుతా..
బాధితులను పరామర్శించిన అనంతరం రాహుల్గాంధీ మీడియాతో మాట్లాడారు. “నేను రాజకీయ కోణంనుంచి మాట్లాడదలుచుకోలేదు. కానీ పరిపాలనలో కొన్ని లోపాలు ఉన్నాయి. తప్పులు ఉన్నాయి. వాటిని గుర్తించాలి” అని యోగి సర్కారుకు సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తుతానని రాహుల్గాంధీ తెలిపారు. తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులతో తాను మాట్లాడానని చెప్పారు.
సత్సంగ్ వద్ద సరైన ఏర్పాట్లు చేయలేదని వారు తనతో చెప్పారని అన్నారు. వారంతా విచారంలో, షాక్లో ఉన్నారని తెలిపారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు వెంటనే ఎంత వీలైతే అంత ఎక్కువ పరిహారం చెల్లించాలని యూపీ సర్కారును డిమాండ్ చేశారు. బాధితులంతా నిరుపేదలని, పరిహారం ఆలస్యం చేయడం వల్ల వారికి ఎలాంటి ప్రయోజనం చేకూరదని రాహుల్ గాంధీ చెప్పారు.
