
- అందుకే కాంగ్రెస్, సీఎం రేవంత్పై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నరు
- బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్పై కాంగ్రెస్ ఎంపీలు ఫైర్
న్యూఢిల్లీ, వెలుగు: ఏదో విధంగా బనకచర్ల బంకను ముంగటేసి తెలంగాణ, ఆంధ్రా సెంటిమెంట్ తో పబ్బం గదుపుకోవాలని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్రావు ప్లాన్ వేశారని కాంగ్రెస్ ఎంపీలు మండిపడ్డారు. అందుకే కాంగ్రెస్, సీఎం రేవంత్రెడ్డిపై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. సీఎం రేవంత్రెడ్డిపై కేటీఆర్ చేసిన కామెంట్లను తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలు చామల కిరణ్కుమార్రెడ్డి, రఘువీర్రెడ్డి, మల్లు రవి, సురేశ్ షెట్కర్, బలరాం నాయక్, రామసహాయం రఘురామ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
అంబేద్కర్, రాజ్యాంగం గురించి కేటీఆర్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎంపీ చామల ఎద్దేవా చేశారు. దళిత సీఎంతోసహా ఇచ్చిన ఏ హామీని నెరవేర్చని ఘనత మాజీ సీఎం కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. ప్రజలు మెచ్చేలా పాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డిని ప్రజలు రీకాల్ చేయరని, రీ ఎలెక్ట్ చేస్తారని చెప్పారు. ఆదర్శవంతంగా రాజకీయాలు చేయాలనుకున్న తమపై ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని ఎంపీ రఘువీర్రెడ్డి హెచ్చరించారు. ఫ్రస్ట్రేషన్తో పిచ్చి కూతలు కూస్తున్నారని కేటీఆర్, హరీశ్రావుపై మండిపడ్డారు.
ప్రతిపక్ష నేత ఫాంహౌస్లో ఎందుకు దాక్కున్నరు?
అసెంబ్లీ లో చర్చలకు రాకుండా ప్రతిపక్షనేత కేసీఆర్ ఫాంహౌస్లో ఎందుకు దాక్కున్నారని ఎంపీ మల్లు రవి ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల జల వివాదాల విషయంలో కీలక చర్చ జరిగిందని చెప్పారు. ఈ ప్రాజెక్టులపై మాట్లాడానికి కేటీఆర్కు అర్హత లేదని, ప్రతిపక్షనేత హోదాలో కేసీఆర్ వస్తే తాము చర్చకు సిద్ధమని చెప్పారు. కేటీఆర్ ఇలాగే మాట్లాడితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఆ తర్వాత ఏం జరిగినా తమ బాధ్యత కాదని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బోర్లా పడిందని, లోకల్ బాడీ ఎన్నికల్లోనూ అదే జరుగుతుందని తెలిపారు. కేటీఆర్కు అధికార దాహం పోవడం లేదని ఎంపీ సురేశ్ షట్కర్ విమర్శించారు. బీఆర్ఎస్ పాపాలు పండాయని, గౌరవంగా మాట్లాడటం నేర్చుకోవాలని కేటీఆర్కు ఎంపీ బలరాం నాయక్ హితవు పలికారు. కాంగ్రెస్ సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని ఎంపీ రామ సహాయం రఘురామరెడ్డి మండిపడ్డారు.