నిజామాబాద్ జిల్లాలో కీలక పదవుల్లో ..కాంగ్రెస్​ పాగా

నిజామాబాద్ జిల్లాలో కీలక పదవుల్లో ..కాంగ్రెస్​ పాగా
  • పార్లమెంట్​ ఎన్నికల ముందు హస్తంలో జోష్​
  • ఒక్కో పోస్ట్​ను కోల్పోతూ ఢీలా పడుతున్న బీఆర్ఎస్​ 

నిజామాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల తర్వాత జిల్లాలో కాంగ్రెస్​ పార్టీ మరింత పుంజుకుంటుంది. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడంతో దూకుడుగా వ్యవహరిస్తూ బీఆర్ఎస్​ లీడర్ల చేతుల్లో ఉన్న పలు కీలక పదవులను తన ఖాతాలోకి వేసుకుంటోంది. రైతులు, ప్రజలతో దగ్గరి సంబంధాలు ఉండే పలు కీలక పోస్టులు కాంగ్రెస్​ లిస్ట్​లో  చేరడంతో ఆ పార్టీలో జోష్​ పెరిగింది. అసెంబ్లీ ఎలక్షన్​లో మిశ్రమ ఫలితాలు వచ్చినా, పార్లమెంట్​ఎన్నికల నాటికి మరింత ఓటు బ్యాంక్​ను తనవైపు తిప్పుకొని ఎంపీ బరిలో సత్తా చాటాలని భావిస్తోంది.

మున్సిపాలిటీల్లో పాగా..

జిల్లాలో నిజామాబాద్​ మున్సిపల్ ​కార్పొరేషన్, బోధన్, ఆర్మూర్, భీమ్​గల్​ మున్సిపాలిటీలున్నాయి.​ వీటిలో బోధన్, ఆర్మూర్ లలో కాంగ్రెస్ పాగా వేసింది. నిజామాబాద్​ మేయర్ ​దండు నీతూకిరణ్​ సైతం బీఆర్ఎస్​తో అంటిముట్టనట్లు ఉంటున్నారు. ఐదు రోజుల కింద ఎమ్మెల్సీ కవిత అరెస్ట్​ను నిరసిస్తూ పార్టీ శ్రేణులు నిరసన చేయగా, ఆమె స్థానికంగా ఉండి కూడా అటెండ్ ​కాలేదు. కాంగ్రెస్​ లీడర్లతో టచ్​లో ఉంటున్నట్లు తెలుస్తోంది. 

ఇక బీఆర్ఎస్​నుంచి బయటకు వచ్చిన బోధన్​ చైర్​పర్సన్ ​తూము పద్మ సహా ఆమెకు మద్దతుగా ఉన్న మెజార్టీ కౌన్సిలర్లు కాంగ్రెస్​కు పూర్తి అనుకూలంగా పనిచేస్తున్నారు. ఆర్మూర్​ మున్సిపాలిటీ పరిధిలోని26 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ ​కండువా ధరించి చైర్​పర్సన్​గా లావణ్యను గెలిపించారు. ఆర్మూర్​లో కాంగ్రెస్​ ఉనికే లేకుండా చేసిన బీఆర్ఎస్  లీడర్లు ఇప్పుడు పత్తా లేకుండా పోయారు. జడ్పీ ఉపాధ్యక్షురాలు రజిత యాదవ్ ​ఇప్పటికే కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకున్నారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే ఈ నేతలకు ప్రజలతో దగ్గరి సంబంధాలుంటాయి. పార్టీ విస్తరణకు ఇది ఉపయోగపడుతోంది. 

మార్క్​ఫెడ్ ​నుంచి డీసీసీబీ దాకా..

జిల్లాకు చెందిన స్టేట్ ​మార్క్ ​ఫెడ్ ​చైర్మన్​ మార గంగా​రెడ్డి బీఆర్ఎస్​కు గుడ్​బై చెప్పి 20 రోజుల కింద కాంగ్రెస్​లో చేరారు. ఇప్పుడు డీసీసీబీ కూడా హస్తగతమైంది. ఈ రెండు పదవులకు వ్యవసాయం, రైతాంగంతో సంబంధం ఉంటుంది. జిల్లాలో 8 లక్షల ఎకరాల అగ్రికల్చర్​ ల్యాండ్​ఉండగా, 3.5 లక్షల మంది రైతులున్నారు. కీలకమైన మార్క్​ఫెడ్, డీసీసీబీ చైర్మన్​ పదవులు కాంగ్రెస్ వైపు రావడంతో రైతులు మరింత దగ్గరయ్యే అవకాశం ఉంది. వీటికి తోడుగా గడిచిన నెల రోజుల్లో దాదాపు 20 సింగిల్​ విండోల్లో  కాంగ్రెస్​ జెండా ఎగిరింది. 

జోష్​ పెంచిన స్టేట్​పదవులు ​ ​

అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. బోధన్, రూరల్ సెగ్మెంట్​లో కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు గెలువగా​ అర్బన్, ఆర్మూర్​లో బీజేపీ, బాల్కొండలో బీఆర్ఎస్​విజయం సాధించాయి. పార్లమెంట్​ ఎలక్షన్​నాటికి పరిస్థితిని తమకు పూర్తి అనుకూలంగా మార్చుకోవాలనే కాంగ్రెస్​ముఖ్య లీడర్లు భావిస్తున్నారు. తాజాగా మైనార్టీ నేత తాహెర్, మాజీ ఎమ్యెల్యే ఈరవత్రి అనిల్, డీసీసీ ప్రెసిడెంట్​ మానాల మోహన్​రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అన్వేశ్​రెడ్డిలకు ముఖ్యమైన నామినేటెడ్​ పోస్టులు దక్కాయి. దీంతో క్యాడర్​కు నాయకత్వ సమస్య తీరి ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ​