
- విద్యా రంగం బడ్జెట్లో ప్రతి ఏటా కోతలు పెడ్తున్నరు
- 9 ఏండ్లుగా ‘కేజీ టు పీజీ’ ఊసెత్తలే
- ఐదో క్లాస్ నుంచి టీఎస్పీఎస్సీ దాకా పరీక్షల నిర్వహణలో ఫెయిల్
- సర్కారు తీరు వల్లే 3,600 మంది విద్యార్థుల ఆత్మహత్యలు
- ఫీజు రీయింబర్స్మెంట్ రాక లక్షలాది మంది చదువుకు దూరం
హైదరాబాద్, వెలుగు: ఇంటికో ఉద్యోగం ఇస్తామని యువతకు సీఎం కేసీఆర్ అబద్ధాలు చెప్పారని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. రాష్ట్రప్రభుత్వం ఉద్యోగ నియామకాల్లో అవకతవకలకు పాల్పడిందని ఆరోపించింది. యువతను బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందంటూ కాంగ్రెస్ బుధవారం ‘యూత్ చార్జ్షీట్’ను రిలీజ్ చేసింది. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కేసీఆర్ ప్రభుత్వం విద్యా రంగానికి అతి తక్కువ నిధులను ఖర్చు చేసిందని ఆరోపించింది. కేసీఆర్ సర్కార్ ఏటేటా విద్యారంగానికి కేటాయించాల్సిన నిధుల్లో కోత పెడుతూ వచ్చిందని పేర్కొంది. 2014–15 రాష్ట్ర బడ్జెట్లో 10.89 శాతం విద్యకు కేటాయించగా.. 2016–17లో 8.23 శాతానికి తగ్గించిందని వెల్లడించింది. 2023–24కి వచ్చే సరికి బడ్జెట్ను 7.6 శాతానికి కుదించినట్లు చెప్పింది.
ఒక్కో నిరుద్యోగికి రూ.1,74,928 బాకీ
‘కేజీ టు పీజీ’ ఉచిత విద్యను అందిస్తామని ప్రకటిం చిన కేసీఆర్.. ఈ 9 ఏండ్లలో దాని ఊసే ఎత్తలేదని యూత్ చార్జ్షీట్లో కాంగ్రెస్ ఆరోపించింది. ‘‘కేసీఆర్ హయాంలో కొత్తగా ఒక్క తరగతి గదినీ నిర్మించలేకపోయారు. గంభీరావుపేటలో కేవలం ఒక కేజీ టు పీజీ విద్యా సంస్థను ఏర్పాటు చేశారు. అది కూడా సీఎస్ఆర్ నిధులతో కట్టించినది. సీఎస్ఆర్ కింద స్కూళ్లను కట్టించాల్సిందిగా కార్పొరేట్ సంస్థలను అడుక్కునే స్థితికి తెలంగాణను తెచ్చారు’’ అని ధ్వజమెత్తింది. ‘‘బిశ్వాల్ కమిటీ నివేదిక ప్రకారం ప్రభుత్వ శాఖల్లో 2 లక్షల ఖాళీలతో ప్రభుత్వం నడుస్తున్నది. 60 శాతం ఉద్యోగులతోనే ఈ సర్కార్ నడుస్తున్నది.
ఐదో తరగతి పరీక్షల నుంచి టీఎస్పీఎస్సీ పరీక్షల వరకు అన్ని పరీక్షల నిర్వహణలో సర్కారు విఫలమైంది. తద్వారా 3,600 మందికిపైగా యువత ఆత్మహత్యలకు కారణమైంది. వరుస వైఫల్యాల తర్వాత కూడా బీఆర్ఎస్ అదే టీఎస్పీఎస్సీ బోర్డును కొనసాగించడం ద్వారా.. పేపర్ లీకేజీ కేసు దర్యాప్తును ఆలస్యం చేసింది. లక్షలాది మంది అభ్యర్థుల విశ్వాసాన్ని కోల్పోయింది” అని మండిపడింది. 2012, 2013లలో ఎలాంటి వివాదాలు లేకుండా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 1.25 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిందని గుర్తుచేసింది. ఒక్క పరీక్ష కూడా సరిగ్గా నిర్వహించలేక బీఆర్ఎస్ విఫలమైందని పేర్కొంది.
రూ.3,016 నిరుద్యోగ భృతిని ఇవ్వడంలో ఘోరంగా విఫలమైందని ఆరోపించింది. ఒక్కో నిరుద్యోగికి సర్కారు రూ.1,74,928 బాకీ పడిందని పేర్కొంది.
ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్కు తూట్లు
ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి బీఆర్ఎస్ ప్రభుత్వం తూట్లు పొడిచిందని కాంగ్రెస్ ఆరోపించింది. ‘‘ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడంతో లక్షలాది మంది యువత చదువుకు దూరమవుతున్నారు. రూ.4,592 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపుల్లో ఆలస్యం వల్ల.. కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లను ఇవ్వడం లేదు” అని చెప్పింది. ప్రభుత్వ యూనివర్సిటీల్లో లెక్చరర్ పోస్టులు 66 శాతం ఖాళీగా ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడింది.
వర్సిటీల్లో కనీస వసతుల్లేక విద్యార్థులు కష్టాలు పడుతున్నారని, కానీ తన సన్నిహితులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రైవేటు యూని వర్సిటీలను సర్కారు ప్రోత్సహిస్తున్నదని, ప్రభుత్వ యూనివ ర్సిటీలను నాశనం చేసిం దని విమర్శించింది. కేసీఆర్ అసమర్థ పాలన వల్ల చాలా మంది యువత మద్యా నికి, డ్రగ్స్కు బానిసలై భవిష్యత్ను పాడు చేసుకుంటున్నారని చార్జ్షీట్లో పేర్కొంది.