చిన్నచింతకుంట, వెలుగు: గ్రామాల అభివృద్దికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి తెలిపారు. సోమవారం దేవరకద్ర మండలం గోపాన్ పల్లి గ్రామంలో చెరువు కట్టల పునరుద్దరణ, సీసీ రోడ్లు, గ్రామ చెరువు కట్ట నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌలతులు కల్పించి గ్రామాభివృద్దికి కృషి చేస్తున్నామని తెలిపారు. విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం వారానికి మూడు రోజులు ప్రజాబాట, -పొలంబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.
అధికారులు పొలాల్లో వంగిపోయిన విద్యుత్ స్తంభాలు, వేలాడుతున్న వైర్లు వంటి వాటిని పరిశీలించి, వెంటనే సరి చేస్తారన్నారు. అనంతరం గృహజ్యోతి లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు. తదనంతరం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎస్.సురేందర్ రెడ్డి తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంప్ను ఆయన ప్రారంభించారు.
