- కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షా రెడ్డి
సిద్దిపేట టౌన్, వెలుగు: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరును తొలగిస్తే సహించమని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షా రెడ్డి అన్నారు. ఆదివారం ఆమె ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలోని గాంధీ విగ్రహం ముందు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అనంతరం ఆంక్షారెడ్డి మాట్లాడుతూ..కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదలు, రైతుల సంక్షేమాన్ని విస్మరిస్తూ మహాత్మా గాంధీ పేరును తొలగించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మహాత్మా గాంధీ పేరు దేశానికి గర్వకారణమని, అలాంటి మహానుభావుడి పేరును సంక్షేమ పథకం నుంచి తొలగించడం ప్రజాస్వామ్యానికి అవమానమని ఆమె విమర్శించారు.
గాంధీ పేరు తొలగిస్తే కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, చంద్రం, గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరేందర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి బుచ్చిరెడ్డి, ఆర్టీఏ మెంబర్ సూర్య వర్మ పాల్గొన్నారు.
సంగారెడ్డి టౌన్: ఉపాధి హామీ పథకంలో నుంచి గాంధీ పేరు తొలగించిన కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్నాయకులు సంగారెడ్డి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గంజి మైదాన్ గాంధీ విగ్రహం వద్ద దీక్ష నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వం గాంధీ పేరు తొలగించాలని కుట్ర చేస్తోందని ఆరోపించారు.
కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ ఆంజనేయులు, టీపీసీసీ కార్యదర్శి అనంత కిషన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు జార్జ్ బ్లాక్, కాంగ్రెస్ అధ్యక్షుడు రఘుగౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, బుచ్చి రాములు, కాంగ్రెస్ నాయకులు సంతోష్, రవి, ప్రవీణ్, నరసింహారెడ్డి, మహేశ్, రాజు, నవాజ్, ఆరిఫ్ ఉన్నారు.
నర్సాపూర్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు తొలగించడాన్ని నిరసిస్తూ నర్సాపూర్ పట్టణంలో గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు.
