కామారెడ్డి మున్సిపాలిటీపై కాంగ్రెస్ ​గురి!

కామారెడ్డి మున్సిపాలిటీపై కాంగ్రెస్ ​గురి!
  •     చైర్​పర్సన్​పై అవిశ్వాసానికి ప్రయత్నాలు
  •     కౌన్సిల్​లో బలం పెంచుకుంటున్న హస్తం
  •     షబ్బీర్ ​అలీతో కౌన్సిలర్ల భేటీతో సంతరించుకున్న ప్రాధాన్యం

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి మున్సిపాలిటీపై కాంగ్రెస్​ ఫోకస్​ పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత క్రమంగా కౌన్సిల్​లో పార్టీ బలాన్ని పెంచుకుంటోంది. గతంలో కాంగ్రెస్​ నుంచి గెలిచి బీఆర్ఎస్​లో చేరిన కౌన్సిలర్లు ఘర్​వాపసీ అవుతుండగా, బీఆర్ఎస్​ కౌన్సిలర్లు సైతం కాంగ్రెస్​లో చేరుతున్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీతో  బుధవారం హైదరాబాద్​లో  కౌన్సిలర్లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ప్రధానంగా సంఖ్యా బలం పెంపు, చైర్​పర్సన్​పై అవిశ్వాస విషయమై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మున్సిపాలిటీలో కాంగ్రెస్​కు 17 మంది కౌన్సిలర్లు ఉండగా, అవిశ్వాసానికి మరో ఎనిమిది మంది మద్దతు అవసరముంది. మున్సిపాలిటీలో మొత్తం 49  వార్డులున్నాయి. గత ఎన్నికల్లో 23 చోట్ల బీఆర్ఎస్, 12 చోట్ల కాంగ్రెస్, 8 చోట్ల బీజేపీ, 6 స్థానాల్లో ఇండిపెండెంట్లు గెలిచారు.

చైర్​పర్సన్​ఎన్నికకు ముందు ఇండిపెండెంట్లుగా గెలిచినవారు బీఆర్ఎస్​లో చేరారు. దీంతో  చైర్​పర్సన్​గా నిట్టు జాహ్నవి, వైస్​చైర్​పర్సన్​గా ఇందుప్రియ ఎన్నికయ్యారు. ఆ తర్వాత 7గురు కాంగ్రెస్​కౌన్సిలర్లు బీఆర్ఎస్​కు మారారు. ఇటీవల స్టేట్​లో కాంగ్రెస్​ అధికారంలోకి రావడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.

కౌన్సిలర్ల హస్తం బాట..

బీఆర్ఎస్​కు చెందిన కౌన్సిలర్లు ఇటీవల హస్తం బాట పడుతున్నారు. ఇందులో కొందరు తమ సొంత గూటికి తిరిగి రాగా, మరి కొందరు బీఆర్ఎస్​వాళ్లు ఉన్నారు. ఎన్నికలకు మందు మున్సిపల్​వైస్​చైర్​పర్సన్​ ఇందుప్రియ కూడా కాంగ్రెస్​లో చేరారు. దీంతో కాంగ్రెస్​ కౌన్సిలర్ల సంఖ్య 17కు చేరింది. ప్రస్తుతం చైర్​పర్సన్​గా బీఆర్ఎస్​కు చెందిన నిట్టు జాహ్నవి ఉండగా ఆమెను పదవి నుంచి దించాలని కాంగ్రెస్​ కౌన్సిలర్లు భావిస్తున్నారు. అవిశ్వాసానికి 25 మంది సభ్యుల మద్దతు కావాల్సి ఉండగా కౌన్సిలర్లతో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ సమావేశం ఏర్పాటు చేయడం హాట్​ టాపిక్​ లా మారింది.త్వరలోనే తమ పార్టీలోకి మరికొందరు కౌన్సిలర్లు చేరుతారని కాంగ్రెస్​ ధీమా వ్యక్తం చేస్తోంది. 

అభివృద్ధిని చూసి  కాంగ్రెస్​లో చేరుతున్నారు:ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ

అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే జరిగిన అభివృద్ధిని చూసి కాంగ్రెస్​లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని షబ్బీర్అలీ పేర్కొన్నారు. కౌన్సిలర్లతో ఆయన హైదరాబాద్​లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అభివృద్ధి విషయంలో తమతో కలిసి నడిచే వాళ్లను స్వాగతిస్తామన్నారు. త్వరలోనే రూ.500 గ్యాస్​సిలిండర్, 200  యూనిట్ల వరకు ఉచిత కరెంట్​ పథకాలు అమలు అవుతాయన్నారు.  డీసీసీ ప్రెసిడెంట్  కైలాస్​శ్రీనివాస్​రావు, వైస్​చైర్​ పర్సన్​ గడ్డం ఇందుప్రియ, కౌన్సిలర్లు సయ్యద్​ అన్వర్, శివకృష్ణమూర్తి, జ్ఞానేశ్వరి, రవీందర్ ​గౌడ్, శంకర్​రావు, ఉరుదొండ వనిత, మమత, ఆస్మా, మామిండ్ల రమేశ్, మానస, లత, లావణ్య, సుగుణ పాల్గొన్నారు.