- కరీంనగర్ ఇన్చార్జి మంత్రి తుమ్మల
- కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ ముఖ్యనేతలతో సమావేశం
కరీంనగర్, వెలుగు: త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ తోపాటు మిగతా మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగురేయాలని కరీంనగర్ ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. సిద్ధిపేటలో మంత్రి తుమ్మల అధ్యక్షతన కరీంనగర్ పార్లమెంట్ స్థాయి కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం బుధవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా నేతలకు దిశా నిర్దేశం చేశారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్, సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి, హుస్నాబాద్, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో పార్టీ సమావేశాలు ఏర్పాటు, నేతల మధ్య సమన్వయం, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం తదితర అంశాలపై చర్చించారు.
మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాస్, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సిరిసిల్ల డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కె,.సత్యనారాయణ, సుడా చైర్మన్ నరేందర్రెడ్డి, కరీంనగర్, సిద్దిపేట , సిరిసిల్ల జిల్లాల లైబ్రరీ సంస్థల చైర్మన్లు మల్లేష్, లింగమూర్తి, సత్యనారాయణ గౌడ్, లీడర్లు వెలిచాల రాజేందర్రావు, మహేందర్ రెడ్డి, ప్రణవ్, అంజన్ కుమార్ పాల్గొన్నారు.
