ఇయ్యాల కాంగ్రెస్ చలో రాజ్​భవన్

ఇయ్యాల కాంగ్రెస్ చలో రాజ్​భవన్

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా, రాహుల్​ను ఈడీ విచారణ పేరుతో కేంద్రం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడడాన్ని నిరసిస్తూ రాజ్​భవన్​ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని పీసీసీ చీఫ్​ రేవంత్ తెలిపారు. రాహుల్ ఈడీ విచారణ నేపథ్యంలో బుధవారం కూడా గాంధీభవన్​లో నిరసన దీక్ష సాగింది. అనంతరం రేవంత్​ మీడియాతో మాట్లాడారు. ఏఐసీసీ పిలుపుతో  గురువారం ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉదయం 10 గంటలకు పీజేఆర్ విగ్రహం దగ్గర నుంచి ర్యాలీగా రాజ్​భవన్ వెళ్తామన్నారు. విచారణ పేరుతో తమ నేతలకు ఇబ్బంది పెట్టడమే కాకుండా పోలీసులు ఏఐసీసీ కార్యాలయంలోకి చొచ్చుకొని వెళ్లి కాంగ్రెస్​ నాయకులు, కార్యకర్తలను కొట్టి అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నామన్నారు.

కేసీఆర్​ మోడీ చేతిలో కీలుబొమ్మ

జిల్లా కేంద్రాలు, కేంద్ర ప్రభుత్వ ఆఫీసుల వద్ద శుక్రవారం నిరసన ప్రదర్శనలు ఉంటాయని, కార్యకర్తలు తరలి రావాలని రేవంత్​ పిలుపునిచ్చారు. సోనియాను ఇబ్బందులకు గురి చేయడం ఈ ప్రాంతవాసులకు అవమానకరమన్నారు. సీఎం కేసీఆర్, ప్రధాని మోడీ చేతిలో కీలుబొమ్మగా ఉన్నారన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీని గెలిపించడానికి కేసీఆర్ సుపారీ తీసుకున్నారని ఆరోపించారు.