
- ముగ్గురు మంత్రులు కూడా బీసీ నేతల పేర్లనే సిఫార్సు చేశారు: మహేశ్ గౌడ్
- మీడియాతో చిట్ చాట్లో పీసీసీ చీఫ్
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీసీ అభ్యర్థినే బరిలోకి దింపుతామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. సోమవారం రాత్రి హైదర్గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఇన్చార్జ్లుగా ఉన్న ముగ్గురు మంత్రులు కూడా బీసీ అభ్యర్థికే టికెట్ ఇవ్వాలని సీఎం రేవంత్కు, పీసీసీకి సిఫార్సు చేశారని చెప్పారు. మంత్రుల సిఫార్సులు, సర్వేల ఆధారంగానే టికెట్ ఖరారు చేస్తామన్నారు.
మంగళవారం సీఎం రేవంత్ రెడ్డితో మరోసారి పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, తాను భేటీ అయి అభ్యర్థి ఎంపికపై చర్చించి నలుగురు ఆశావహుల పేర్లను హైకమాండ్కు సిఫార్సు చేస్తామని చెప్పారు. ఆ తర్వాత రెండు, మూడ్రోజుల్లో పార్టీ హైకమాండ్ అభ్యర్థిని ప్రకటించనుందన్నారు. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు రెండ్రోజుల్లో బస్తీ బాట కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
ఈ నెలాఖరున కామారెడ్డిలో బీసీ సభ..
ఈ నెలాఖరులో కామారెడ్డిలో బీసీ సభను నిర్వహిస్తామని మహేశ్ గౌడ్ తెలిపారు. అలాగే, డిసెంబర్ చివరి నాటికి పెండింగ్లో ఉన్న అన్ని నామినేటెడ్ పోస్టులను, పార్టీ పదవులను భర్తీ చేస్తామన్నారు. ఈ ఎన్నికల్లో మజ్లిస్ మద్దతుపై కాంగ్రెస్ ఆలోచన చేస్తున్నదని చెప్పారు. లోకల్ బాడీ ఎన్నికల్లో స్థానిక పరిస్థితులను బట్టి సీపీఐ, సీపీఎం, జన సమితి అభ్యర్థులకు టికెట్లు ఇస్తామని తెలిపారు.