రామ్ మందిర్ నిర్మాణానికి విరాళాలు సేకరిస్తున్న కాంగ్రెస్ యూత్ వింగ్

రామ్ మందిర్ నిర్మాణానికి విరాళాలు సేకరిస్తున్న కాంగ్రెస్ యూత్ వింగ్
  • ‘రాముని పేరిట ఒక్క రూపాయి’ పేరుతో 15 రోజులపాటు విరాళాల సేకరణ
  • మతశక్తులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ యూత్ వింగ్ నిర్ణయం

రాజస్థాన్‌లోని కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌యుఐ) అయోధ్యలోని రామ్ మందిర్ నిర్మాణానికి విరాళాలు సేకరించాలని మంగళవారం పిలుపునిచ్చింది. అందులో భాగంగా ‘రాముని పేరిట ఒక్క రూపాయి’ (Re 1 Ram Ke Naam) పేరుతో 15 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లోని విద్యార్థుల నుంచి చందాలు వసూలు చేయనున్నట్లు ఎన్‌ఎస్‌యూఐ ఆఫీస్ బేరర్లు తెలిపారు.

‘బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థల కార్యకర్తలు లార్డ్ రామ్ పేరిట డబ్బులు వసూలు చేస్తూ ప్రజలపై ఒత్తిడి తెస్తున్నారు. ఆ విధంగా దేశంలో దోపిడీ జరుగుతోంది. దేవునికి డబ్బు అవసరం లేదు, కానీ భక్తి అవసరం అనే సందేశాన్ని ప్రజలలోకి పంపడం కోసం మేం ఈ ప్రచారాన్ని నిర్వహించాం. మీరు భక్తితో ఒక్క రూపాయి విరాళంగా ఇచ్చినా.. అది కోటి రూపాయలతో సమానం. రామ్ మందిర్ పేరిట దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్న మత శక్తులకు మా ప్రచారం ఒక సందేశం’ అని ఎన్‌ఎస్‌యుఐ రాజస్థాన్ అధ్యక్షుడు అభిషేక్ చౌదరి అన్నారు. తాము రాజకీయాల్లో ఏ మతం సహాయం తీసుకోవలసిన అవసరం లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ప్రకారం పనిచేసే పార్టీ అని అభిషేక్ చౌదరి అన్నారు.

ఈ 15 రోజులలో సేకరించిన మొత్తాన్ని.. రామ్ మందిర్ ఆలయ ట్రస్టుకు విరాళంగా ఇస్తామని రాజస్థాన్ ఎన్‌ఎస్‌యుఐ ప్రతినిధి రమేష్ భాటి తెలిపారు. ‘బీజేపీ ప్రచారానికి విరుద్ధంగా, లార్డ్ రామ్ హిందువులకు లేదా ఏదైనా నిర్దిష్ట సమాజానికి మాత్రమే దేవుడు కాదు. లార్డ్ రామ్ ముస్లీం, సిక్కు మరియు క్రైస్తవ వర్గాలకు కూడా దేవుడే అనే సందేశం ఇవ్వడమే మా ముఖ్య ఉద్దేశం’ అని భాటి అన్నారు.

కాగా.. రామ్ మందిర్ నిర్మాణం కోసం సేకరిస్తున్న విరాళాలను కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేసిందని స్ధానిక బీజేపీ నాయకులు ఆరోపించారు. ‘రామ్ మందిర్ నిర్మాణం కోసం సేకరిస్తున్న విరాళాలను కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా చూస్తోంది. అయినా విరాళాలను బీజేపీ సేకరించడం లేదు. ప్రజలు స్వచ్ఛందంగా రామ్ జన్మభూమి తీర్త్ క్షేత్ర ట్రస్టుకు విరాళంగా ఇస్తున్నారు’ అని రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు సతీష్ పూనియా అన్నారు.

For More News..

ఎంపీలకు వార్నింగ్ ఇచ్చిన వెంకయ్య నాయుడు

కుల బహిష్కరణ చేశారని వాటర్ ట్యాంక్ ఎక్కిన వ్యక్తి

ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్న సీనియర్ నటి రాధిక