విద్యుత్​ రంగాన్ని చీకట్లోకి నెట్టేసే కుట్ర : మంత్రి జగదీశ్​రెడ్డి

విద్యుత్​ రంగాన్ని చీకట్లోకి నెట్టేసే కుట్ర : మంత్రి జగదీశ్​రెడ్డి

హనుమకొండ సిటీ, వెలుగు: తెలంగాణలో విద్యుత్​ రంగాన్ని చీకట్లోకి నెట్టేసే కుట్ర జరుగుతోందని మంత్రి జగదీశ్​రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్-1104 యూనియన్​ పవర్​మెన్​2023 డైరీని బుధవారం హంటర్​ రోడ్డులోని విష్ణుప్రియా గార్డెన్స్​లో మంత్రులు జగదీశ్​రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్​రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  మంత్రి జగదీశ్​ రెడ్డి మాట్లాడుతూ గుజరాత్​రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభం నెలకొందన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశంలో నవరత్నాలుగా పిలిచే అన్ని కంపెనీలను ప్రైవేటుపరం చేస్తోందని ఆరోపించారు. అందులో భాగంగానే విద్యుత్​ రంగంపైనా కుట్ర జరుగుతోందని, విద్యుత్​ ఉద్యోగులు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు మాట్లాడుతూ ఇదివరకు రాష్ట్రంలో కరెంట్ సరిగా లేక హైదరాబాద్​, వరంగల్ తదితర ప్రాంతాల్లో ఇండస్ట్రీలు మూతపడ్డాయన్నారు. కానీ  విద్యుత్ ఎంప్లాయీస్ సహకారంతో 24 గంటలు నాణ్యమైన కరెంట్​అందిస్తున్నామని, దీంతో కంపెనీలు క్యూ కడుతున్నాయన్నారు. కానీ కొంతమంది అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, సీఎం కేసీఆర్​ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. విద్యుత్​ ఉద్యోగుల సమస్యలను సీఎం కేసీఆర్​ దృష్టి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి చొరవ చూపుతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, కుడా చైర్మన్​ సంగంరెడ్డి సుందర్​రాజ్ యాదవ్, యూనియన్​ అధ్యక్షుడు వి.వెంకటేశ్వర్లు, ఎస్​పీడీసీఎస్​ సీఎండీ రఘుమారెడ్డి, ఎన్​పీడీసీఎల్​ సీఎండీ గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.

దేవాదుల వర్క్స్​మేలోగా పూర్తి చేయాలె

హనుమకొండ: దేవాదుల ప్రాజెక్టు పనులు వచ్చే మే నెలలోగా కంప్లీట్​ చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు ఆఫీసర్లను ఆదేశించారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని దేవాదుల పనుల పురోగతిపై హనుమకొండ కలెక్టరేట్​ కాన్ఫరెన్స్​ హాలులో బుధవారం రివ్యూ చేశారు. ముందుగా పనుల పురోగతిని ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి దయాకర్​రావు మాట్లాడుతూ ప్యాకేజీ మూడు, ఆరు కింద ఉమ్మడి జిల్లాలోని  వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్​ జిల్లాలు ఉన్నాయన్నారు. ఈ ప్రాజెక్టుల కింద ఉప్పుగల్లు, నష్కల్, పాలకుర్తి రిజర్వాయర్లున్నాయని, వాటి పనులు పూర్తి కాలేదని పేర్కొన్నారు. భూసేకరణ, రోడ్డు డైవర్షన్లు, మిషన్​ భగీరథ పనులకు సంబంధించిన ఇబ్బందులన్నీ తొలగించామన్నారు. ఇదివరకు కాంట్రాక్టర్​ పనులు చేయకపోతే సీఎం కేసీఆర్​ దృష్టికి తీసుకెళ్లి రీ టెండర్​పెట్టించామని, అయినా పనులు అనుకున్నంతగా సాగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా కొడకండ్ల, పాలకుర్తి, రాయపర్తి, వర్ధన్నపేట తదితర మండలాలకు నీళ్లు రాలేదని చెప్పారు. గతంలో ఆరు నెలల్లో కంప్లీట్​ చేస్తామని హామీ ఇచ్చారని, కానీ మూడేండ్లవుతున్నా పూర్తి కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొందర్లోనే సీఎం కేసీఆర్​ దేవాదుల ప్రాజెక్టుపై రివ్యూ చేస్తారని, ఆ లోగా పనులన్నీ కంప్లీట్​ చేయాలని ఆదేశించారు. అంతకుముందు హనుమకొండ నక్కలగుట్టలోని డీసీసీబీ బిల్డింగ్​లో బ్యాంక్​ 2023 డైరీని మంత్రి ఎర్రబెల్లి ఆవిష్కరించారు. సమావేశంలో హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లా కలెక్టర్లు రాజీవ్​ గాంధీ హనుమంతు, డాక్టర్ బి.గోపి, శివలింగయ్య, చీఫ్ ఇంజినీర్ సుధాకర్ రెడ్డి, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.