ఇందూరు సీనియర్​ కానిస్టేబుళ్లకు  చేజారిన ప్రమోషన్లు

ఇందూరు సీనియర్​ కానిస్టేబుళ్లకు  చేజారిన ప్రమోషన్లు
  • హెడ్​కానిస్టేబుల్​ అయ్యే టైంలో కొంపముంచిన 317 జీఓ
  • జిల్లా యూనిట్​గా ప్రమోషన్లు ఇయ్యకపోవడంతో 1999 బ్యాచ్​కు నష్టం
  • ఇక కానిస్టేబుళ్లగానే రిటైర్​ కావాల్సిన పరిస్థితి

వెలుగు, నిజామాబాద్ : 317 జీఓ  ప్రకారం పోలీస్​శాఖలో ఇటీవల చేపట్టిన ప్రమోషన్లలో ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాకు చెందిన 1999 బ్యాచ్​ కానిస్టేబుళ్లకు తీవ్ర అన్యాయం జరిగింది. గతంలో కోర్టు తీర్పు వల్ల జిల్లాలో ఆగిపోయిన ప్రమోషన్లు ఇచ్చాక.. చేయాల్సిన ట్రాన్స్​ఫర్లను , జోనల్ యూనిట్​గా చేయడంతో సమస్య వచ్చింది. ఏమాత్రం ముందుచూపు, శాస్త్రీయత లేకుండా చేసిన ఈ  ట్రాన్స్​ఫర్ల వల్ల తాము ఇక కానిస్టేబుళ్లుగానే రిటైర్​ కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని1999 బ్యాచ్​ కానిస్టేబుళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రమోషన్లు వస్తాయనుకునే టైంలో.. 

పోలీస్​శాఖలో కానిస్టేబుల్​ జిల్లా క్యాడర్​ పోస్టు కాగా, హెడ్​ కానిస్టేబుల్​ పోస్టులను జోనల్​ క్యాడర్​ కిందికి తెచ్చారు. ప్రస్తుతం జోన్​ 2 ( బాసర) పరిధిలో నిజామాబాద్​, నిర్మల్​, ఆదిలాబాద్,​ జగిత్యాల జిల్లాలున్నాయి. నిజానికి  జిల్లాల్లోని కానిస్టేబుళ్లకు గతంలో ఆగిపోయిన ప్రమోషన్లు ఇచ్చాక జోన్​ పరిధిలో ట్రాన్స్​ఫర్లు చేయాలి. అలాకాకుండా జోన్​ యూనిట్​గా తీసుకొని నాలుగు జిల్లాల్లోని కానిస్టేబుళ్లను సీనియారిటీ ఆధారంగా ప్రమోషన్లు ఇస్తూ ట్రాన్స్​ఫర్  చేయడంతో ఉమ్మడి నిజామాబాద్​జిల్లాకు చెందిన సీనియర్లు నష్టపోయారు. ఉమ్మడి నిజామాబాద్ ​జిల్లాలో 86  ఖాళీలుండగా, వీటిలో 68 హెడ్​కానిస్టేబుల్​ పోస్టులను అదిలాబాద్ , నిర్మల్, జగిత్యాల జిల్లాకు చెందిన వాళ్లతో నింపేశారు. నిజానికి 1999 బ్యాచ్​లోని 116 మందిలో ఆరుగురికి 2018లోనే ప్రమోషన్లు వచ్చాయి. తర్వాత తమను కూడా పరిగణలోకి తీసుకోవాలని ఏఆర్​టూ సివిల్ కానిస్టేబుళ్లు కోర్టుకు వెళ్లడంతో ఆగిపోయాయి. ఎట్టకేలకు ప్రమోషన్లకు 2022లో  క్లియరెన్స్​ వచ్చింది. ఈక్రమంలో తమకు ప్రమోషన్లు వస్తాయని 1999 బ్యాచ్​ సీనియర్లు ఆశిస్తున్న టైంలో 317 జీఓ రూపంలో మరో పిడుగు వచ్చి పడింది. 

ఎవరికీ ప్రయోజనం లేకుండా.. 

తాజా ప్రమోషన్ల వల్ల నిజామాబాద్​ జిల్లాకు చెందిన సీనియర్​ కానిస్టేబుళ్లు ఎలాగైతే నష్టపోయారో, ఆయా జిల్లాల నుంచి నిజామాబాద్​ వచ్చిన 68 మంది కానిస్టేబుళ్లూ అలాగే నష్టపోయారు. ఆదిలాబాద్ , నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో రిటైర్​మెంట్​కు దగ్గరైన వాళ్లను ప్రమోషన్​పై నిజామాబాద్​ పంపడం వల్ల వారికి ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. సొంత జిల్లాల్లో రిటైరయ్యే వాళ్లను నిజామాబాద్​ జిల్లాకు తేవడంతో భార్యాపిల్లలు, ఇండ్లు ఓ చోట, వాళ్లో చోట తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈక్రమంలో ఇటీవల1999 బ్యాచ్​కు చెందిన కానిస్టేబుళ్లు అడిషనల్​ డీజీపీ పర్సనల్​ శివధర్​రెడ్డికి వినతిపత్రం ఇచ్చి తమ గోడు వెల్లబోసుకున్నారు. ఐదేండ్లుగా తాము హెడ్​కానిస్టేబుల్​ అయినట్లే అని చెప్పుకుంటూ తిరిగామని, తీరా తలెత్తుకొని తిరగలేని పరిస్థితి వచ్చిందని, మానసికంగా కుంగిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి శాస్త్రీయత లేకుండా నిర్వహించిన ప్రమోషన్లు, ట్రాన్స్​ఫర్లను రద్దుచేసి  తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 200 నుంచి 300 వరకు ఉన్న 1999 బ్యాచ్​ సీనియర్​ కానిస్టేబుళ్లందరికీ ఒకే నోషనల్​ ప్రమోషన్​ ఇవ్వడం ద్వారా తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.