
కోల్బెల్ట్, వెలుగు: సింగరేణి సంస్థ లాభాల్లో వాటాను కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికులు ధర్నాకు దిగారు. శుక్రవారం సాయంత్రం మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్ సింగరేణి సివిల్ఆఫీస్ముందు సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్వర్కర్స్ యూనియన్(ఇఫ్టూ) లీడర్లు, కార్మికులు ఆందోళన చేపట్టారు. యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్డి.బ్రహ్మనందం మాట్లాడుతూ.. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు కోలిండియా వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ సర్కార్ ఏర్పడితే కాంట్రాక్ట్ కార్మికులకు కోలిండియా వేతనాలు ఇప్పిస్తామని ఎన్నికల ముందు ఎమ్మెల్యేలు, మంత్రులు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. గత బీఆర్ఎస్ సర్కార్ కార్మికులను మోసం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. పర్మినెంట్ కార్మికులతో సమానంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు లాభాల్లో 10శాతం వాటా ఇవ్వాలని డిమాండ్చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సింగరేణి సివిల్ సూపర్వైజర్ సమ్రాన్కు అందజేశారు. లీడర్లు శంకర్, ముత్యాల వెంకటేశ్, మల్లేశ్, రాజన్న, రంజిత్, సంతోశ్ పాల్గొన్నారు.