నర్సంపేట, వెలుగు: వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్నగర్లో కాకతీయుల కాలంలో నిర్మించిన పురాతన శివాలయాన్ని ఓ కాంట్రాక్టర్ కూల్చివేయడం చర్చనీయాంశమైంది. గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. క్రీస్తుశకం 1230 ప్రాంతంలో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడి హయాంలో అశోక్నగర్లో ఈ శివాలయాన్ని నిర్మించారు. ఏడు దశాబ్దాలుగా ఆలయం శిథిలావస్థలోనే ఉంది. ఇటీవల అశోక్నగర్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో స్కూల్ బిల్డింగ్ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ ఎలాంటి అనుమతులు లేకుండానే పురాతన శివాలయాన్ని జేసీబీతో తొలగించారు. ఈ ఘటనపై చరిత్రకారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆలయాన్ని ఎవరి అనుమతితో కూల్చారనే విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారసత్వ సంపద అయిన పురాతన శివాలయాన్ని కూల్చడం హేయమైన చర్య అని గ్రామస్తులు వాపోయారు.
