హైదరాబాద్, వెలుగు: రియల్ఎస్టేట్ సెక్టార్లో రెరా తీసుకొచ్చినట్టే సిమెంట్, స్టీల్ ధరలను కంట్రోల్ చేసేందుకు అథారిటీస్ను కేంద్రం ఏర్పాటు చేయాలని క్రెడాయ్ తెలంగాణకు కొత్త చైర్మన్గా ఎన్నికైన మురళి కృష్ణ కోరారు. చదరపు అడుగుకు రూ.5,000–6,000 దగ్గర తాము బయ్యర్లతో అగ్రిమెంట్ కుదుర్చుకుంటున్నప్పుడు సిమెంట్ బస్తా రేటు రూ.200 దగ్గర ఉంటోందని, తర్వాత రేట్లు రూ.400 వరకు పెంచేస్తున్నారని అన్నారు. స్టీల్ ధరలు కూడా విచ్చలవిడిగా పెంచేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు పాత మాస్టర్ ప్లాన్ వలన లక్షల ఎకరాలు లాక్ అయిపోయి ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం కొత్త మాస్టర్ ప్లాన్ తీసుకురావాలని ఆయన కోరారు. లక్షల ఎకరాలు లాక్ అయి పోవడం వలన కొన్ని ఏరియాల్లో ఎకరం వాల్యూ రూ.100 కోట్లను దాటుతోందని చెప్పారు. మాస్టర్ ప్లాన్ కమిటీలో క్రెడాయ్ సభ్యుడికి అవకాశం ఇవ్వాలని, కొత్త లేఅవుట్లను డిజైన్ చేయడంలో సాయపడతామని వెల్లడించారు.
2023– 2025 కోసం కొత్త టీమ్ను క్రెడాయ్ తెలంగాణ ఎన్నుకుంది. క్రెడాయ్ తెలంగాణ యూత్ వింగ్ కమిటీ కోసం కూడా కొత్త టీమ్ ఎన్నికైంది. తెలంగాణ క్రెడాయ్కు ప్రెసిడెంట్గా ప్రేమ్సాగర్ రెడ్డి, ఎలెక్ట్ ప్రెసిడెంట్గా ఇంద్రసేన రెడ్డి, సెక్రెటరీగా అజయ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్లుగా పురుషోత్తం రెడ్డి, పాండురంగా రెడ్డి, గుర్రం నరసింహ రెడ్డి ఎన్నికయ్యారు. జీఓ111 ను రాష్ట్ర ప్రభుత్వం తొలగించాలని చూస్తోందని, ఎన్విరాన్మెంట్కు హాని చేయకుండా డిస్నీల్యాండ్, యూనివర్సల్ స్టూడియో వంటివి ఏర్పాటు చేయడానికి రెడీగా ఉన్నామని మురళి కృష్ణ పేర్కొన్నారు. సిటీని టూరిజంకు డెస్టినేషన్గా మారుస్తామని చెప్పారు. ప్రేమ్సాగర్ రెడ్డి మాట్లాడుతూ, రెరా చట్టంపై డెవలపర్లలో అవగాహన కలిపిస్తామని, లేబర్ల స్కిల్స్ను మెరుగుపరచడానికి వివిధ ప్రోగ్రామ్లు నిర్వహిస్తామని వివరించారు. ముఖ్యంగా టైర్ 2, 3 సిటీలపై ఫోకస్ పెడుతున్నామని, తెలంగాణలో కొత్త చాప్టర్లను ఓపెన్ చేస్తామని అన్నారు.